కుప్పంపై ప్రత్యేక దృష్టి పెట్టిన చంద్రబాబు.. పూర్తి పగ్గాలు చేతిలోకి తీసుకున్న ఏపీ సీఏం..
Chandrababu Naidu Calls for Global Recognition of Andhra Shrimp Industry
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై కుప్పం నియోజకవర్గ వ్యవహారాలన్నీ తానే స్వయంగా చూసుకుంటానని పార్టీ నేతలకు స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో నియోజకవర్గ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి.
అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కుప్పం నియోజకవర్గ టీడీపీ నేతలతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కంచర్ల శ్రీకాంత్ అంశం చర్చకు వచ్చింది. వాస్తవానికి ఇంఛార్జి బాధ్యతల నుంచి తనను తప్పించాలని శ్రీకాంత్ గత కొంతకాలంగా అధిష్ఠానాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న చంద్రబాబు.. ఆయన్ను బాధ్యతల నుంచి తప్పిస్తూ నిర్ణయం ప్రకటించారు. కంచర్ల శ్రీకాంత్ సేవలను రాష్ట్రస్థాయిలో వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే తాను కుప్పంలో పర్యటిస్తానని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.
కాగా, కంచర్ల శ్రీకాంత్ స్థానంలో అనంతపురం జిల్లాకు చెందిన మరో శ్రీకాంత్కు కుప్పం నియోజకవర్గ సమన్వయ బాధ్యతలు అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన మార్గదర్శకత్వంలో జరిగే పార్టీ కార్యక్రమాల్లో స్థానిక నేతలు చురుగ్గా పనిచేయాలని చంద్రబాబు సూచించినట్లు సమాచారం. మరోవైపు, కంచర్ల శ్రీకాంత్ను చంద్రబాబు తన వ్యక్తిగత సహాయకుడిగా (పీఏ) నియమించుకున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ నియామకాలపై పార్టీ నుంచి అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.
2023లో జరిగిన తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కంచర్ల శ్రీకాంత్ అనూహ్య విజయం సాధించి రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందారు. అనంతరం శాసనమండలిలో విప్గా, కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (కాడా) పొలిటికల్ ఛైర్మన్గా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీ ప్రక్షాళనలో భాగంగా, అలాగే ఆయన సేవలను విస్తృత స్థాయిలో వాడుకోవాలనే ఉద్దేశంతోనే ఈ మార్పు జరిగినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.