Skip to content
తెలంగాణ వార్తలు

Musi Riverfront Project: మూసీ ప్రక్షాళనపై రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. NGTలో పర్యావరణ అంశంపై పిటిషన్.. తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు..

jagan 11 Sep 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Musi Riverfront Project: మూసీ ప్రక్షాళనపై రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. NGTలో పర్యావరణ అంశంపై పిటిషన్.. తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు..

Musi Riverfront Project

Musi Riverfront Project: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది ప్రక్షాళన , పునరుజ్జీవన ప్రాజెక్టుకు మరోసారి న్యాయపరమైన అడ్డంకి ఎదురైంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పర్యావరణ అనుమతుల్లో తీవ్ర లోపాలు ఉన్నాయంటూ రిటైర్డ్ ఇంజినీర్లు చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) దక్షిణాది బెంచ్‌ను ఆశ్రయించారు. ఈ అప్పీల్‌పై ప్రాథమిక విచారణ జరిపిన ట్రిబ్యునల్, ప్రతివాదిగా ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

అప్పీల్‌దారులు లేవనెత్తిన ప్రధాన అభ్యంతరాల ప్రకారం.. మొత్తం 55 కిలోమీటర్ల మూసీ పరివాహక ప్రాంతం ఉండగా, ప్రభుత్వం కేవలం 20 కిలోమీటర్ల మేర మాత్రమే పర్యావరణ అధ్యయనం చేసిందని ఆరోపించారు. అంతేకాకుండా, ఈ రీజియన్‌లోనే సున్నితమైన మృగవాణి నేషనల్ పార్క్ విస్తరించి ఉందని పేర్కొన్నారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల సమీపంలో చేపడుతున్న భారీ నిర్మాణాలు, వాణిజ్య సముదాయాల ఏర్పాటు పర్యావరణ వ్యవస్థకు తీవ్ర విఘాతం కలిగిస్తాయని వారు ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లారు. పర్యావరణ అనుమతుల జారీలో చట్టబద్ధ నిబంధనలను ఉల్లంఘించారని అభ్యంతరం తెలిపారు.

చెన్నై ఎన్జీటీ బెంచ్ ఈ అప్పీల్‌ను స్వీకరించి, పర్యావరణ అనుమతులు , ప్రాజెక్టు నిర్వహణపై తమ వివరణను, సమగ్ర వివరాలను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతంలో కూడా మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టుపై దాఖలైన పిటిషన్‌ను ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎన్జీటీ కొట్టివేసి ప్రభుత్వానికి ఊరటనిచ్చిన నేపథ్యంలో, తాజాగా నమోదైన ఈ పిటిషన్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేసు తదుపరి విచారణను ట్రిబ్యునల్ వచ్చే నెల 16వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజున ప్రభుత్వం సమర్పించే వివరణ మూసీ ప్రాజెక్టు భవిష్యత్తుకు అత్యంత కీలకం కానుంది.