Skip to content
తెలంగాణ వార్తలు

Voter List Revision: ఓటర్ల జాబితా సవరణ.. సినీ ప్రముఖులకు నోటీసులు..లిస్టులో రాజమౌళి, మహేష్ బాబు, సమంత, విజయ్ దేవరకొండ ఇతరులు..

jagan 11 Sep 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Voter List Revision: ఓటర్ల జాబితా సవరణ.. సినీ ప్రముఖులకు నోటీసులు..లిస్టులో రాజమౌళి, మహేష్ బాబు, సమంత, విజయ్ దేవరకొండ ఇతరులు..

SIR: రాష్ట్రంలో 78.14 శాతం ఎస్ఐఆర్ డిజిటైజేషన్ పూర్తి

Voter List Revision: కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా చేపడుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా హైదరాబాద్‌లోని పలువురు ప్రముఖులకు నోటీసులు జారీ కావడం చర్చనీయాంశంగా మారింది. సినీ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన పలువురు వీఐపీల పేర్లు ఈ సమగ్ర పరిశీలన జాబితాలో ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ నోటీసులు అందుకున్న వారిలో ప్రముఖ నటి సమంత, హీరో విజయ్ దేవరకొండ, ఆయన సోదరుడు ఆనంద్ దేవరకొండ, కథానాయకుడు మహేశ్ బాబు, ఆయన భార్య నమ్రత, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సీనియర్ నటుడు వెంకటేశ్, ఆయన కుమార్తెలు ఉన్నారు. అలాగే మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, మిథాలీ రాజ్, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, పుల్లెల గోపీచంద్, దివిస్ లాబొరేటరీస్ అధినేత మురళీ కృష్ణ ప్రసాద్ దివి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం.

ఓటర్ల వివరాల్లో పేర్లు లేదా తల్లిదండ్రుల పేర్ల ఉచ్చారణలో తేడాలు ఉండటం, పాత రికార్డులతో వివరాలు పూర్తిగా సరిపోలకపోవడం (Unmapped) వంటి సాంకేతిక కారణాల వల్లే అధికారులు ఈ నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసు జారీ అయినంత మాత్రాన ఓటు హక్కు రద్దయినట్లు కాదని, ఇది కేవలం వివరాల పారదర్శక ధ్రువీకరణలో భాగమేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నోటీసులు పొందిన వారు స్వయంగా గానీ లేదా తమ తరఫున ప్రతినిధుల ద్వారా గానీ అవసరమైన పత్రాలను సమర్పించి వివరాలను సరిచేసుకోవచ్చని స్పష్టం చేశారు.

ఇదే తరహా సవరణ ప్రక్రియ ఇతర రాష్ట్రాల్లోనూ కొనసాగుతుండగా.. కర్ణాటకలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని కుటుంబం, జెరోధా వ్యవస్థాపకులు నితిన్, నిఖిల్ కామత్‌లకు కూడా నోటీసులు పంపినట్లు వెల్లడైంది. అయితే భారతరత్న సీఎన్‌ఆర్ రావుకు నోటీసు ఇచ్చారన్న వార్తలను ఎన్నికల సంఘం ఖండించింది. ఓటర్లలో అవగాహన కోసం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో నోటీసులు జారీ అయిన వారి వివరాలను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.