Skip to content
ఆంధ్రప్రదేశ్ వార్తలు

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. స్టీల్‌ మెటల్‌ లిక్విడ్‌ లాడిల్‌ పేలి 8 మంది కార్మికులు మృతి

Prajapaksham 08 Jun 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. స్టీల్‌ మెటల్‌ లిక్విడ్‌ లాడిల్‌ పేలి 8 మంది కార్మికులు మృతి

Fire (rep Image)

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌లో సోమవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్లాంట్‌లోని ఎస్‌ఎంఎస్‌-2 (SMS-2), ఎస్‌టీసీ-3 (STC-3) విభాగంలో ఉక్కు ద్రవాన్ని తరలించే హీట్‌ ఎఫ్‌జీ స్టీల్‌ మెటల్‌ లిక్విడ్‌ లాడిల్‌ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో భారీ ఎత్తున ఉక్కుద్రవం లీకై చుట్టుపక్కల మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.

సుమారు 1,500 డిగ్రీల సెల్సియస్ అత్యధిక వేడితో ఉన్న స్టీల్‌ మెటల్‌ లిక్విడ్‌ను ల్యాడిల్‌ ద్వారా పైకి లిఫ్ట్‌ చేస్తుండగా ఈ పేలుడు సంభవించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో భయాందోళనకు గురైన కార్మికులు, ఉద్యోగులు ప్రాణాలు కాపాడుకోవడానికి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు, లోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ఈ ఘోర ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆయన ఉన్నతాధికారులతో అత్యవసరంగా మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో ఉంటూ పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు తక్షణమే అత్యంత మెరుగైన వైద్య చికిత్స అందించాలని, అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. స్టీల్‌ ప్లాంట్ ఉన్నతాధికారులు ప్రస్తుత పరిస్థితిని, అక్కడ జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ వివరాలను సీఎంకు నివేదించారు.

ఈ ప్రమాద ఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తక్షణమే స్పందించారు. విజయనగరం పర్యటనలో ఉన్న ఆమెకు ఈ విషయం తెలియగానే, తన పర్యటనను ముగించుకుని హుటాహుటిన విశాఖపట్నానికి బయలుదేరారు. మార్గమధ్యంలోనే విశాఖ జిల్లా కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్‌లతో ఫోన్‌లో మాట్లాడి ప్రమాద తీవ్రతపై ఆరా తీశారు. ఆసుపత్రిలో చేరిన బాధితులకు ఎలాంటి లోటు లేకుండా అత్యుత్తమ వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్లాంట్ పరిసరాల్లో సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని రక్షక మరియు అగ్నిమాపక సిబ్బందికి ఆమె సూచించారు.