Skip to content
తెలంగాణ వార్తలు

Telangana Assembly Session: అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్.. కేటీఆర్, హరీశ్ రావు సహా పలువురు సభ్యుల సస్పెన్షన్..

jagan 09 Sep 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Telangana Assembly Session: అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్.. కేటీఆర్, హరీశ్ రావు సహా పలువురు సభ్యుల సస్పెన్షన్..

BRS MLC Arrest

Telangana Assembly Session: తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి. సభా కార్యక్రమాలను వరుసగా అడ్డుకుంటున్నారనే కారణంతో భారత రాష్ట్ర సమితి (BRS)కి చెందిన ముఖ్య నేతలతో సహా పలువురు ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సస్పెన్షన్ వేటు వేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తానీరు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, కోవా లక్ష్మి, సునీతా లక్ష్మారెడ్డి, పాడి కౌశిక్ రెడ్డిలతో పాటు పలువురు BRS సభ్యులను ప్రస్తుత అసెంబ్లీ సెషన్ పూర్తయ్యేంత వరకు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

బుధవారం ఉదయం సభ ప్రారంభమైన కొద్దిసేపటికే, నిన్న ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ వద్ద చోటుచేసుకున్న ఘటనలు మరియు బీఆర్ఎస్ నిర్వహించిన ‘చావుడప్పు’ నిరసనల అంశంపై ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీకర్ స్థానాన్ని చుట్టుముట్టి నినాదాలు చేయడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రతిపక్ష సభ్యులు కావాలని సభా కాలాన్ని వృథా చేస్తూ, గత గంటసేపటి నుంచి సభా కార్యక్రమాలను పూర్తిగా అడ్డుకుంటున్నారని శాసనసభా వ్యవహారాల మంత్రి డి.శ్రీధర్‌బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సభను సజావుగా నడిపేందుకు ఆటంకం కలిగిస్తున్న BRS సభ్యులను సస్పెండ్ చేయాలంటూ మంత్రి శ్రీధర్‌బాబు సభలో ప్రతిపాదించిన తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. తీర్మానం నెగ్గడంతో స్పీకర్ సస్పెన్షన్ నిర్ణయాన్ని వెలువరించి, సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. ఈ పరిణామంతో శాసనసభ ప్రాంగణంలో తీవ్ర రాజకీయ వేడి రాజుకుంది.