Skip to content
తెలంగాణ వార్తలు

Telangana Political Row: కేటీఆర్‌,హరీష్‌ రావు విడుదల.. రేవంత్ సర్కారుపై ధ్వజమెత్తిన బీఆర్ఎస్ నేతలు..

jagan 08 Sep 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Telangana Political Row: కేటీఆర్‌,హరీష్‌ రావు విడుదల.. రేవంత్ సర్కారుపై ధ్వజమెత్తిన బీఆర్ఎస్ నేతలు..

Telangana Political Row

Telangana Political Row: తెలంగాణలో రాజకీయం తీవ్ర స్థాయికి చేరుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి నివాస ముట్టడికి కాంగ్రెస్ నేతలు పిలుపునివ్వడం, దానిని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ శ్రేణులు యత్నించడంతో యాదాద్రి పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి రాళ్లు రువ్వుకునే వరకు పరిస్థితి వెళ్లింది. ఎర్రవల్లికి వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులతో పాటు పలువురు ఎమ్మెల్యేలను పోలీసులు బొల్లారం, హకీంపేట్ వద్ద అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. కేటీఆర్‌ను బోయిన్‌పల్లి పీఎస్‌కు, హరీశ్‌రావును జవహర్‌నగర్ పీఎస్‌కు తరలించిన అనంతరం సాయంత్రం విడుదల చేశారు.

పోలీస్ స్టేషన్ల నుంచి విడుదలైన అనంతరం కేటీఆర్, హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ గుండాలను ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్ ఇంటి మీదికి పంపారని కేటీఆర్ ఆరోపించారు. అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలపై హేయంగా దాడి చేయించారని, 600కు పైగా హామీలిచ్చి వెయ్యి రోజులు కాస్తున్నా ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు. మహాలక్ష్మి పథకం కింద స్కూటీలు ఇస్తామని చెప్పి ప్రజలను లూటీ చేశారని మండిపడ్డారు. దశాబ్దాల తెలంగాణ కల నెరవేర్చి, హైదరాబాద్‌ను విశ్వనగరంగా నిలబెట్టిన ఘనత కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు.

ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. హెడ్‌లైన్స్ మార్చడం ద్వారా ప్రజల జీవితాలు మారవని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి వచ్చిందని, యూరియా కోసం యాప్‌లు పెట్టి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకపోవడం, ఉద్యోగుల సమస్యలు పట్టించుకోకపోవడంపై నిలదీశారు. అసెంబ్లీ ప్రాంగణంలో సబితా ఇంద్రారెడ్డి గొంతుపై పోలీసు చేయి వేసి నొక్కారని, గౌరవంగా ఉండాల్సిన శాసనసభను రేవంత్ రెడ్డి కౌరవసభగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.