Skip to content
ఆంధ్రప్రదేశ్ వార్తలు

Vijayasai Reddy: వైసీపీ, టీడీపీ ఫ్యాక్షన్ పార్టీలే.. స్వార్థ ప్రయోజనాలే వాటి అజెండా.. విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

jagan 07 Sep 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
Vijayasai Reddy: వైసీపీ, టీడీపీ ఫ్యాక్షన్ పార్టీలే.. స్వార్థ ప్రయోజనాలే వాటి అజెండా.. విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

Vijayasai Reddy

Vijayasai Reddy: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి సంచలన పరిణామాలకు తెరతీశారు. రాష్ట్రంలో నూతన రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు వెల్లడిస్తూ.. దానికి సంబంధించిన విధానాలు, ప్రణాళికలను సోమవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఏపీకి ఇప్పుడు మూడో రాజకీయ ప్రత్యామ్నాయం అత్యంత ఆవశ్యకమని.. ప్రస్తుతం ఉన్న ప్రధాన పార్టీలు ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించాయని ఆయన మండిపడ్డారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు ప్రజా శ్రేయస్సు కోసం కాకుండా కేవలం రెండు కుటుంబాల స్వప్రయోజనాల కోసం, ఫ్యాక్షన్ తరహా రాజకీయాల కోసమే పనిచేస్తున్నాయని విజయసాయిరెడ్డి విమర్శించారు. ఆరు కోట్ల ప్రజల సంపదను, రాష్ట్ర వనరులను ఏ పార్టీ దోచుకోవాలనే పోటీలోనే ఈ రెండు వర్గాలు కొట్టుకుంటున్నాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వ్యాపారులు, సామాన్యులు ఏ చిన్న పని చేసుకోవాలన్నా నాయకులకు, అధికారులకు మామూళ్లు చెల్లించాల్సి వస్తోందని, ప్రజల సంక్షేమం కంటే రాజకీయాల్లో పెట్టిన పెట్టుబడులను తిరిగి రాబట్టుకోవడమే లక్ష్యంగా ఇరు పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.

నూతన పార్టీ స్వరూపం, భావజాలంపై విజయసాయిరెడ్డి వెల్లడించిన కీలక అంశాలు:

సీఎం రేసులో ఉండను: తాను కొత్త పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండనని, మహారాష్ట్రలో బాల్ థాక్రే తరహాలో కేవలం ఒక మార్గదర్శకుడిగా (మెంటార్‌గా) మాత్రమే వెనకుండి పార్టీని నడిపిస్తానని స్పష్టం చేశారు.
బీసీ, కాపు నేతలకు ప్రాధాన్యం: కేవలం రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలే కాకుండా బీసీలు, కాపులు, వెలమలు, మైనార్టీలలో అర్హత, సామర్థ్యం ఉన్న ఏ నాయకుడైనా సీఎం అయ్యే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
యువతకు 66% సీట్లు: ‘జెన్ జీ’ (Gen Z) మరియు యువతను రాజకీయంగా బలోపేతం చేసేందుకు, 2029 నాటికి 25 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న యువతకే నామినేటెడ్ పదవులతో సహా 66 శాతం ఎమ్మెల్యే/ఎంపీ సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు.
అమరావతిపై స్పష్టత: అమరావతే రాజధాని అని, దానికి తాను వ్యతిరేకం కాదని చెప్తూనే, ప్రభుత్వ నిధులను వృథా చేయకుండా ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడంపై శ్రద్ధ వహించాలని సూచించారు.

త్వరలోనే అనంతపురం, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో ప్రెస్ మీట్లు నిర్వహించి పార్టీ అజెండాలోని ఐదు ప్రధానాంశాలను ప్రజల ముందుకు తీసుకెళ్తానని, తద్వారా రాబోయే రోజుల్లో సమగ్ర ఎన్నికల మేనిఫెస్టోను రూపొందిస్తానని విజయసాయిరెడ్డి ప్రకటించారు.