ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ఘోర విషాదం.. నీటి కుంటలో ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు మృతి..
Tragedy in Prakasam: Four Children Die While Bathing in Pond
ఒంగోలు నగర పరిధిలోని చెరువుకొమ్ముపాలెం గ్రామం వద్ద తీవ్ర విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. సరదాగా ఈత కొడదామని వెళ్లిన నలుగురు చిన్నారులు ప్రమాదవశాత్తు నీటికుంటలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతులను కరేటి అభిరామ్ (14), అతని తమ్ముడు కరేటి సుశాంత్ (12) లతో పాటు పొదిలి చిన్ను (11), ఇల్లా దినేష్ (10) లుగా గుర్తించారు. చెరువుకొమ్ముపాలెం సమీపంలోని నీటికుంట వద్దకు ఆడుకోవడానికి వెళ్లిన ఈ నలుగురు చిన్నారులు, లోతు తెలియకుండా ఈతకు దిగి నీటిలో గల్లంతయ్యారు.
చిన్నారులు ఎంతకూ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు, స్థానికులు వారి కోసం వెతకడం ప్రారంభించారు. నీటికుంట వద్ద దుస్తులు కనిపించడంతో సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే ఘటనాస్థలానికి చేరుకున్నారు. స్థానిక ఈతగాళ్ల సాయంతో కుంటలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ గాలింపులో అన్నదమ్ములైన అభిరామ్, సుశాంత్లతో పాటు దినేష్, చిన్నుల మృతదేహాలు ఒకరి తర్వాత ఒకరు నీటిలో నుంచి లభ్యమయ్యాయి. కళ్ల ముందే ఆడుకుంటూ తిరిగిన నలుగురు చిన్నారులు ఇలా విగతజీవులుగా మారడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తమ పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు గుండెలవిసేలా ఏడుస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.