18 ఏళ్ల స్నేహాన్ని బంగారం కోసం బలి చేశాడు..బుర్ఖా ధరించి డబ్బు కోసం ఫ్రెండ్ని చంపేసిన మిత్రుడు..
Kanpur Man in Burqa Kills Friend for Gold Chain, Masculine Walk Exposes Him
డబ్బు, బంగారం కోసం 18 ఏళ్ల నాటి ప్రాణ స్నేహితుడిని ఒక వ్యక్తి అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘోర ఉదంతం ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో వెలుగుచూసింది. బుర్ఖా వేసుకుని మహిళ రూపంలో వచ్చి స్నేహితుడిని మట్టుబెట్టిన నిందితుడిని పోలీసులు సీసీటీవీ ఆధారాలతో చాకచక్యంగా అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం, కాన్పూర్కు చెందిన ప్రకాశ్ చంద్ర గుప్తా అనే వ్యక్తి కంప్యూటర్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. అతనికి మోహిత్ ద్వివేది అనే వ్యక్తితో 18 సంవత్సరాల సుదీర్ఘ స్నేహం ఉంది. అయితే, ప్రకాశ్ ఎప్పుడూ మెడలో ధరించే సుమారు 5 లక్షల రూపాయల విలువైన బంగారు గొలుసుపై మోహిత్ కన్ను పడింది. దానిని ఎలాగైనా దక్కించుకోవాలనే దురాశతో ప్రకాశ్ను హతమార్చడానికి మోహిత్ ముందే ఒక పక్కా వ్యూహాన్ని రచించాడు.
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరిగిన మే 31 రాత్రి ప్రకాశ్ తన కోచింగ్ సెంటర్లోనే ఒంటరిగా ఉన్నాడని తెలుసుకున్న మోహిత్ అక్కడికి వెళ్లాడు. తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు నల్లటి బుర్ఖా ధరించడమే కాకుండా, మహిళలు వేసుకునే ఆభరణాలు, చెప్పులు కూడా ధరించాడు. కోచింగ్ సెంటర్లోకి చొరబడి ప్రకాశ్ మెడలోని బంగారు గొలుసును లాక్కోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్రమైన పెనుగులాట జరిగింది. మోహిత్ బలంగా నెట్టేయడంతో ప్రకాశ్ కిందపడిపోయి, తలకు బలమైన గాయం కావడంతో రక్తస్రావమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం నిందితుడు ప్రకాశ్ మెడలోని బంగారు గొలుసుతో పాటు చేతికున్న బంగారు బ్రాస్లెట్ను కూడా తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు.
మరుసటి రోజు ఉదయం ప్రకాశ్ కుటుంబ సభ్యులు కోచింగ్ సెంటర్కు వచ్చి చూసేసరికి అతడు రక్తపు మడుగులో శవమై కనిపించాడు. ప్రాథమికంగా పోలీసులు ఇది ప్రమాదవశాత్తు కిందపడటం వల్ల జరిగిన మరణంగా భావించినప్పటికీ, మృతుడి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు మాయమవ్వడంతో ఇది ముమ్మాటికీ చోరీ కోసం జరిగిన హత్యేనని నిర్ధారించుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఈ కేసును ఛేదించడానికి పోలీసులు ఘటనా స్థలం పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో బుర్ఖా ధరించి వెళ్తున్న ఒక వ్యక్తి కదలికలు పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించాయి. సదరు వ్యక్తి నడక తీరు మహిళలా కాకుండా పురుషుడిలా ఉండటాన్ని గమనించిన పోలీసులు, ఆ దిశగా సుమారు 100 సీసీటీవీ కెమెరాలను విశ్లేషిస్తూ నిందితుడిని ట్రాక్ చేశారు. చివరకు ఒక కారులో బుర్ఖా విప్పేసి సాధారణ దుస్తుల్లోకి మారుతున్న వ్యక్తిని చూసి పోలీసులు షాకయ్యారు. అతడు మరెవరో కాదు, మృతుడికి అత్యంత ఆప్తుడైన స్నేహితుడు మోహిత్ ద్వివేది అని గుర్తించి వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల విచారణలో నిందితుడు మోహిత్ తన నేరాన్ని అంగీకరించాడు. అయితే, హత్య చేసిన తర్వాత కూడా తనపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు అతడు ఆడిన డ్రామాలు పోలీసులను విస్మయానికి గురిచేశాయి. ప్రకాశ్ చనిపోయాడని తెలిసిన తర్వాత ఏమీ తెలియనట్లు అతడి కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి పరామర్శించాడు. అంతేకాకుండా, నేరం జరిగిన మరుసటి రోజే ఒక పోటీ పరీక్షకు హాజరై, ఆ తర్వాత లక్నోకు పారిపోయినట్లు దర్యాప్తులో తేలింది. కేవలం డబ్బు, బంగారం కోసం 18 ఏళ్ల స్నేహాన్ని బలితీసుకుని ఇంత దారుణానికి ఒడిగడతాడని ఊహించలేకపోయామని మృతుడి సోదరుడు కన్నీరుమున్నీరయ్యాడు.