కృష్ణా నది వెస్ట్ బైపాస్ రోడ్డుపై యోగాంధ్ర కార్యక్రమం..అమరావతిపై సీఎం చంద్రబాబు కీలక అప్డేట్..
Chandrababu Press Meet on Yoga: Andhra Pradesh Gears Up for Yogandhra 2026
ఆరోగ్యవంతమైన, అభివృద్ధి చెందిన ‘ఆరోగ్యాంధ్రప్రదేశ్’, ‘స్వర్ణాంధ్రప్రదేశ్’ రాష్ట్రాలను సాధించాలంటే ‘యోగాంధ్ర’ కార్యక్రమం అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో యోగా కార్యక్రమాల నిర్వహణపై మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రజల దైనందిన జీవన విధానంలో యోగాను ఒక భాగం చేసేందుకు వీలుగా ప్రతి సంవత్సరం ‘యోగాంధ్ర’ను నిర్వహించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు.
ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ‘యోగా ఫర్ హెల్తీ ఏజ్’ అనే ప్రత్యేక థీమ్ను పాటిస్తున్నామని, మనుషులు వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా జీవించేలా తగిన చర్యలు తీసుకోవడమే దీని ముఖ్య ఉద్దేశమని ఆయన వివరించారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ ‘సంజీవని’ పథకంలో యోగాను కూడా అనుసంధానం చేయనున్నట్లు సీఎం వెల్లడించారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రెండు వారాల పాటు (14 రోజులు) రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున యోగా కార్యక్రమాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రభుత్వ , ప్రైవేటు విద్యాసంస్థలతో పాటు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లా , మండల కేంద్రాలతో పాటు వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో ఈ వేడుకలను జరపాలని ఆదేశించారు. ఈ ‘యోగాంధ్ర 2026’ ద్వారా రాష్ట్రంలో కనీసం ఒక కోటి మంది ప్రజలు యోగాలో పాల్గొనేలా పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని, అలాగే 10 లక్షల మందిని గుర్తింపు పొందిన (సర్టిఫైడ్) యోగా సాధకులుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రబాబు తెలిపారు.
గత ఏడాది ఏపీలో నిర్వహించిన యోగా కార్యక్రమాల ద్వారా అనేక రికార్డులను సృష్టించామని, తద్వారా ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ వైపు తిరిగి చూసేలా చేయగలిగామని సీఎం ఈ సందర్భంగా గుర్తుచేశారు. నిరుడు విశాఖపట్నం బీచ్ రోడ్డు పక్కన భారీ ఎత్తున యోగా నిర్వహించగా, ఈసారి విజయవాడలోని కృష్ణా నది వెస్ట్ బైపాస్ రోడ్డుపై యోగా ప్రదర్శనలు చేయనున్నట్లు వెల్లడించారు. దీనివల్ల రాజధాని అమరావతి నగర అందాలను ప్రపంచ దేశాలకు చాటిచెప్పే అద్భుతమైన అవకాశం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మరోవైపు, మానవ శరీరానికి వచ్చే 21 రకాల ప్రముఖ వ్యాధులను నయం చేయడానికి లేదా అదుపులో ఉంచడానికి ఉపయోగపడే ప్రత్యేక యోగాసనాల వీడియోలను ప్రభుత్వ సలహాదారు మంతెన సత్యనారాయణ రాజు రూపొందించారని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ప్రజలందరికీ సులువుగా అందుబాటులో ఉండేలా ఈ వీడియోలను సామాజిక మాధ్యమాలలో (సోషల్ మీడియా) ఉంచినట్లు తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమాలకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా లేదా సమగ్ర సమాచారం తెలుసుకోవాలన్నా ప్రజలు ‘8142404888’ అనే ప్రత్యేక కాల్ సెంటర్ నంబర్ను సంప్రదించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.