పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రం..ఇరాన్ను వెంటనే వీడాలని భారత పౌరులకు కేంద్రం అత్యవసర హెచ్చరిక..
India Urges Citizens to Exit Iran Amid Escalating West Asia Conflict
ఇరాన్ – ఇజ్రాయెల్ దేశాల మధ్య ఘర్షణలు మరోసారి తీవ్రస్థాయికి చేరుకోవడంతో పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం (Indian Embassy) అక్కడ నివసిస్తున్న భారతీయ పౌరుల భద్రతకై అత్యవసర ప్రయాణ మార్గదర్శకాలను (Advisory) జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితులు చక్కబడే వరకు భారత పౌరులెవరూ ఇరాన్కు ప్రయాణాలు పెట్టుకోవద్దని గట్టిగా సూచించింది. అలాగే, ఇప్పటికే ఇరాన్లో ఉన్న భారతీయులు అందుబాటులో ఉన్న విమాన లేదా ఇతర రవాణా మార్గాల ద్వారా తక్షణమే ఆ దేశాన్ని వీడి స్వదేశానికి తిరిగి రావాలని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది.
పశ్చిమాసియాలో ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి భారత ప్రభుత్వం తన పౌరుల రక్షణ కోసం నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. యుద్ధ వాతావరణం మొదలైన తర్వాత ఇప్పటివరకు దాదాపు 1,600 మందికి పైగా భారతీయ పౌరులను ప్రభుత్వం ప్రత్యేకంగా ఇరాన్ నుండి సురక్షితంగా తరలించింది. అంతేకాకుండా, ఈ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా పశ్చిమాసియాలోని వివిధ దేశాల నుండి ఇప్పటివరకు దాదాపు 6 లక్షల మంది భారత పౌరులు స్వచ్ఛందంగా స్వదేశానికి తిరిగి వచ్చినట్లు కేంద్ర విదేశాంగ శాఖ అధికారికంగా వెల్లడించింది.
ఇదిలా ఉండగా, ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇరు దేశాల మధ్య దాడులు సరికొత్త వ్యూహాత్మక స్థాయికి చేరుకున్నాయి. లెబనాన్పై ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ముమ్మరంగా దాడులు ప్రారంభించగా, దానికి ఇజ్రాయెల్ మరింత శక్తివంతంగా ప్రతిస్పందించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్కు చెందిన అత్యంత ప్రతిష్టాత్మకమైన మషహర్ పెట్రోకెమికల్ ప్లాంట్పై ఇజ్రాయెల్ మిలిటరీ వైమానిక దాడికి తెగబడింది. నైరుతి ఇరాన్ పరిధిలో ఉంటూ ఆ దేశ పెట్రో కెమికల్స్ ఎగుమతుల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఈ మషహర్ కాంప్లెక్స్, ఇజ్రాయెల్ జరిపిన ఈ దాడిలో తీవ్రంగా ధ్వంసమైనట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు వెల్లడించాయి. ఈ పరిణామం ఇరు దేశాల ఆర్థిక , వ్యూహాత్మక ప్రయోజనాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.