Skip to content
ప్రపంచం వార్తలు

కాంగోలో ఎబోలా విజృంభణ..వంద మందికి పైగా మృతి..అంతర్జాతీయంగా ఆందోళన..

Prajapaksham 09 Jun 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
కాంగోలో ఎబోలా విజృంభణ..వంద మందికి పైగా మృతి..అంతర్జాతీయంగా ఆందోళన..

Ebola Burial Team Attacked as 11 Patients Flee Care Amid Growing Congo Outbreak

మధ్య ఆఫ్రికా దేశమైన కాంగోలో ఎబోలా వైరస్ మరోసారి తీవ్రస్థాయిలో విజృంభిస్తూ కలకలం రేపుతోంది. ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడి అక్కడ ఇప్పటివరకు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది. కాంగో ఆరోగ్య అధికారులు విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం, దేశంలో ఇప్పటివరకు 550కి పైగా ఎబోలా కేసులు నమోదయ్యాయి. వీరిలో 101 మంది మరణించగా, కేవలం 19 మంది మాత్రమే ఇప్పటివరకు పూర్తిగా కోలుకోగలిగారు. మరికొంత మందిలో వ్యాధి లక్షణాలు కనిపించడంతో దాదాపు 309 మంది అనుమానితులను ప్రస్తుతం ప్రత్యేక ఐసోలేషన్‌లో ఉంచి పర్యవేక్షిస్తున్నారు.

ఇటురి, నార్త్ కిపు ప్రాంతాలలో వైరస్ ఉధృతి అత్యంత తీవ్రంగా ఉంది. కేవలం ఆదివారం ఒక్కరోజే ఈ ప్రాంతాల్లో కొత్తగా 35 కేసులు నిర్ధారణ అవ్వడమే కాకుండా, మరో 10 మంది రోగులు మరణించారు. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి గరిష్ఠ స్థాయికి చేరుకుందని, రాబోయే కొన్ని రోజుల్లో ఈ తీవ్రత క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అయితే, క్షేత్రస్థాయిలో సరైన సమయంలో వ్యాధిని నిర్ధారించలేకపోవడం, ఈ వైరస్‌కు నిర్దిష్టమైన చికిత్సగానీ, సమర్థవంతమైన టీకాగానీ అందుబాటులో లేకపోవడం వైద్య సిబ్బందికి పెద్ద సవాలుగా మారింది. ఇప్పటివరకు నమోదైన గణాంకాల కంటే వాస్తవంగా బాధితుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

ఈ పరిణామాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తీవ్రంగా స్పందిస్తూ ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. కాంగో సరిహద్దులు దాటి ఈ వ్యాధి ప్రాంతీయంగా ఇతర పొరుగు దేశాలకు కూడా వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. ఇప్పటికే కాంగో పొరుగు దేశమైన ఉగాండాలో 19 ఎబోలా కేసులు అధికారికంగా నిర్ధారణ అయ్యాయి, అక్కడ కూడా ఈ వైరస్ కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు పర్యవేక్షణను తీవ్రం చేసి, వ్యాప్తిని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *