ప్రసాదంలో మత్తు మందు కలిపి యువతులపై లైంగిక దాడి.. గలీజు దందాల ఐఐటీ బాబాను అరెస్ట్ చేసిన పోలీసులు
IIT Graduate Accused of Trapping Young Women at Mathura Ashram Through Online Sermons
సమాజంలో ఆధ్యాత్మిక గురువుగా నటిస్తూ, వ్యక్తిగత ఎదుగుదల, కెరీర్ మార్గదర్శకత్వం పేరిట విద్యావంతులైన యువతులను నమ్మించి, వారిపై లైంగికంగా దాడీకి పాల్పడుతున్న ఒక ఐఐటీ (IIT) రూర్కీ గ్రాడ్యుయేట్ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు యువతులకు మత్తుమందు కలిపిన ప్రసాదం ఇచ్చి, ఆపై వారిని లొంగదీసుకుని, అసభ్యకరమైన వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
అధికార్త నారాయణ్ దాస్ అని చెప్పుకుంటున్న 29 ఏళ్ల నిందితుడు అభిషేక్ మిశ్రాను సోమవారం రాధా కుండ్లోని అతని ఆశ్రమం అని చెప్పుకునే నివాసం నుంచి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి బారి నుంచి ఇద్దరు మహిళలను, ఒక పురుషుడిని కూడా పోలీసులు రక్షించారు.
ఛత్తీస్గఢ్కు చెందిన ఒక 22 ఏళ్ల బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని మే 25న గోవర్ధన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఎఫ్ఐఆర్ (FIR) ప్రకారం.. ఒక పర్యటన సందర్భంగా నిందితుడు మిశ్రా ఆమెకు ‘ప్రసాదం’గా పాలు ఇచ్చాడు. ఆ పాలు తాగిన వెంటనే అందులోని మత్తు పదార్థం వల్ల ఆమె స్పృహ కోల్పోయింది. తాను అపస్మారక స్థితిలో ఉన్న సమయంలో మిశ్రా తనపై అత్యాచారం చేసి, అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు తీశాడని సదరు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తానని బెదిరిస్తూ తన నుండి రూ. 5 లక్షలు డిమాండ్ చేశాడని దర్యాప్తు అధికారులకు తెలిపింది.
డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనిల్ కుమార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. సదరు బాధితురాలు ఒక ఆయిల్ పీఎస్యూ (PSU) లో శిక్షణ పొందుతూ, మిశ్రా మత సమూహంతో సంబంధం ఉన్న తన అక్కను కలవడానికి మధురకు వచ్చినట్లు తెలిసింది.
నిందితుడు యూట్యూబ్ ప్రసంగాలు, సోషల్ మీడియా వేదికల ద్వారా తనను తాను పెద్ద ఆధ్యాత్మిక గురువుగా ప్రదర్శించుకుంటూ అనుచరులను సంపాదించుకున్నాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. అతను ఉద్దేశపూర్వకంగానే సమాజంలో విద్యావంతులైన మహిళలను, ముఖ్యంగా ఇంజనీర్లు, ప్రతిష్టాత్మక కంపెనీలలో పనిచేసే మహిళా నిపుణులను లక్ష్యంగా చేసుకుని వల విసిరేవాడు. వారికి ఆధ్యాత్మిక సలహాలు, కెరీర్ మార్గదర్శకత్వం అందిస్తున్నట్లు నమ్మించి, ఆ తర్వాత లైంగికంగా దాడి చేసేవాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
దర్యాప్తులో భాగంగా మిశ్రా మొబైల్ ఫోన్ను పరిశీలించగా, అందులో వివిధ పురుషులు, మహిళలకు సంబంధించిన డజనుకు పైగా అశ్లీల ఫోటోలు లభ్యమవడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ కేసులో బాధితుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసు విచారణలో నిందితుడు అభిషేక్ మిశ్రా తాను ఐఐటీ రూర్కీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్లో పట్టభద్రుడయ్యానని వెల్లడించాడు.
మధురకు వెళ్లడానికి ముందు ప్రైవేట్ రంగంలో సుమారు రూ. 20 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం కూడా చేసినట్లు సమాచారం. మొదట రాధా కుండ్లో ఒక అద్దె ఇంట్లో నివాసం ఉంటూ మతపరమైన కార్యకలాపాలు ప్రారంభించిన మిశ్రా, ఆ తర్వాత అక్కడ ఒక ఇల్లు కొనుగోలు చేసి తన ఆధ్యాత్మిక నెట్వర్క్ను విస్తరించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితుడిని జైలుకు పంపామని, అతని నేరాల పూర్తి స్థాయిని పరిశీలించేందుకు, మిగతా బాధితులను గుర్తించేందుకు సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామని అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (గ్రామీణ) సురేష్ చంద్ర రావత్ తెలిపారు.