కాంగోలో ఎబోలా కలకలం.. అంత్యక్రియల బృందంపై దాడి.. 11 మంది రోగులు చికిత్స కేంద్రం నుంచి పరార్
Ebola Burial Team Attacked as 11 Patients Flee Care Amid Growing Congo Outbreak
తూర్పు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC)లో ఎబోలా వైరస్ మహమ్మారి తీవ్రత రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. ఈ వ్యాధిని అరికట్టేందుకు ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న ఆరోగ్య సిబ్బందిపై స్థానికులు దాడులకు తెగబడుతున్నారు. తాజాగా దక్షిణ కివు ప్రావిన్స్లోని కటానా పట్టణంలో ఎబోలా బారిన పడి మరణించిన వ్యక్తి మృతదేహాన్ని శాస్త్రీయ పద్ధతిలో, సురక్షితంగా ఖననం చేయడానికి ప్రయత్నించిన బృందంపై స్థానిక ప్రజలు దాడి చేశారు. ఈ దాడి భయంతో కార్మికులు శవపేటికను అక్కడే వదిలేసి పారిపోవడంతో, స్థానికులు మృతదేహాన్ని తాకారు. ఎబోలా సోకి చనిపోయిన వారి శరీరాల ద్వారా వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తుంది కాబట్టి.. ఈ ఉదంతం వల్ల కొత్తగా మరిన్ని ఇన్ఫెక్షన్ కేసులు ఏర్పడే ప్రమాదం ఉందని ఆరోగ్య అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
మరోవైపు ఈ మహమ్మారికి ప్రధాన కేంద్రంగా మారిన ఇటూరి ప్రావిన్స్లో పరిస్థితి మరింత చేయి దాటిపోతోంది. అక్కడ చికిత్స పొందుతున్న 11 మంది ఎబోలా రోగులు ఐసోలేషన్ కేంద్రాల నుండి పారిపోవడం తీవ్ర కలకలం రేపింది. దీనికి తోడు ఆయా ప్రాంతాలలో సాయుధ తిరుగుబాటు బృందాలు సృష్టిస్తున్న అల్లర్ల కారణంగా మానవతా సహాయం అందించడానికి వెళ్లే సిబ్బందికి రక్షణ కరువైంది.
బుధవారం విడుదలైన అధికారిక నివేదిక ప్రకారం, ఇటూరి ప్రావిన్స్లోని ‘రింబా’ ప్రాంతం కొత్తగా ఎబోలా బారిన పడింది. దీనితో ఇటూరిలో ఎబోలా విస్తరించిన ఆరోగ్య ప్రాంతాల సంఖ్య 17కు చేరగా, దేశవ్యాప్తంగా ఈ సంఖ్య 25కు పెరిగింది. రింబా వైపు ఈ వ్యాధి భౌగోళికంగా విస్తరించడం అనేది సమాజంలో వైరస్ చాలా చురుగ్గా వ్యాపిస్తోందనడానికి స్పష్టమైన సంకేతమని నివేదిక పేర్కొంది.
కాంగో జాతీయ ప్రజారోగ్య సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం, దేశంలో ఇప్పటివరకు 363 నిర్ధారిత ఎబోలా కేసులు నమోదు కాగా, ఇందులో ‘బుండిబుగ్యో స్ట్రెయిన్’ వల్ల 62 మంది ప్రాణాలు కోల్పోయారు. జూన్ 2వ తేదీ ఒక్కరోజే కొత్తగా 19 కేసులు వెలుగుచూశాయి. వ్యాధి సోకిన వారితో సంబంధాలు ఉన్న (కాంటాక్టులు) సుమారు 4,200 మందిని గుర్తించి ఫాలో-అప్ చేయాల్సి ఉండగా, నిఘా బృందాలు అందులో సగం మందిని కూడా సంప్రదించలేకపోతున్నాయి.
ప్రస్తుతం కాంటాక్ట్ ట్రేసింగ్ రేటు కేవలం 46 శాతంగానే ఉంది. వందకు 95 మందిని గుర్తించాలనేది ప్రభుత్వ లక్ష్యం కాగా, అందులో సగం కూడా సాధించలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇటూరి ప్రావిన్స్లో సేకరించిన 70 నమూనాల పరీక్షలు పూర్తవగా, అందులో సుమారు 27 శాతం మందికి ఎబోలా పాజిటివ్గా తేలింది. అయితే ఉత్తర కివు ప్రావిన్స్లో మాత్రం ఐదు రోజులకు పైగా ఆలస్యం కావడం వల్ల 42 పరీక్షల ఫలితాలు ఇంకా పెండింగ్లోనే ఉండిపోయాయి.
ఈ ఎబోలా వ్యాప్తి ఇప్పుడు కాంగో సరిహద్దులు దాటి పొరుగు దేశాలకు విస్తరిస్తోంది. ఉగాండాలో ఇప్పటికే ఒక మరణంతో సహా 15 ఎబోలా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో పాటు, ఎబోలా సోకిన ఒక కాంగో ప్రయాణికుడు ఉగాండాకు వెళ్లే ముందు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ను కూడా సందర్శించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) బుధవారం వెల్లడించింది. మహమ్మారి ప్రభావిత ప్రాంతాలను సందర్శించి వచ్చిన డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రేయెసస్ మాట్లాడుతూ.. ఈ వ్యాప్తి చాలా వేగంగా ముందుకెళ్తోందని, మనం ఇంకా దాని వెనుకే పరుగెడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే కాంగో ప్రభుత్వ నాయకత్వంలో తాము మళ్లీ పుంజుకుంటున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మహమ్మారిని అంతం చేయడానికి కేవలం వైద్య చికిత్సలు, మందులు మాత్రమే సరిపోవని, ప్రభుత్వాల బలమైన నాయకత్వం, జవాబుదారీతనం, అంతర్జాతీయ భాగస్వామ్యం మరియు ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించడం అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు.