Skip to content
బిజినెస్ వార్తలు

జియో కొత్త అధ్యాయం.. 5G, AI, బ్రాడ్‌బ్యాండ్‌పై అంబానీ భారీ బెట్.. ఐదు కీలక లక్ష్యాలతో భవిష్యత్ వ్యూహం ఇదే..

Prajapaksham 19 Jun 2026 1 నిమిషాల పఠనం బిజినెస్
జియో కొత్త అధ్యాయం.. 5G, AI, బ్రాడ్‌బ్యాండ్‌పై అంబానీ భారీ బెట్.. ఐదు కీలక లక్ష్యాలతో భవిష్యత్ వ్యూహం  ఇదే..

Reliance Jio’s Next Chapter: Ambanis Bet Big on 5G, AI and Broadband Growth (Photo-AI Generated Image)

రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన ప్రముఖ టెలికాం సంస్థ ‘రిలయన్స్ జియో’ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా 524 మిలియన్ల (52.4 కోట్లు) చందాదారుల మైలురాయిని దాటి, భారతదేశపు అతిపెద్ద టెలికాం కంపెనీగా తన నంబర్ 1 స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్న నేపథ్యంలో.. సంస్థ తదుపరి వృద్ధిని నడిపించే ఐదు కీలక వ్యూహాత్మక రోడ్ మ్యాప్ ప్రకటించింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) 49వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM)లో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాష్ అంబానీ ఈ వివరాలను వెల్లడించారు. కేవలం ఒక దశాబ్ద కాలంలోనే జియో అసాధారణమైన కార్యాచరణ స్థాయిని సాధించిందని, ఇకపై 5G వినియోగం, గృహ బ్రాడ్‌బ్యాండ్, ఎంటర్‌ప్రైజ్ డిజిటలైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), గ్లోబల్ టెక్నాలజీ ఆఫరింగ్‌ల ద్వారా తదుపరి ప్రయాణం సాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

జియో ప్రకటించిన 5-సూత్రాల ప్రణాళిక ప్రకారం.. భారతదేశపు డిజిటల్ పురోగతికి ‘జియో ట్రూ 5జీ’ని పునాదిగా నిలపడం కంపెనీ తొలి లక్ష్యం. 6జీ ప్రమాణాల అభివృద్ధిలో దేశాన్ని అగ్రస్థానంలో నిలుపుతూనే, 2030 నాటికి జియో చందాదారులందరినీ 5జీ సాంకేతికతకు మార్చాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. రెండవ లక్ష్యంగా దేశంలోని ప్రతి ప్రాంతానికి హై-స్పీడ్ హోమ్ బ్రాడ్‌బ్యాండ్‌ను చేర్చడం, మూడవ లక్ష్యంగా భారతీయ చిన్న, మధ్యతరహా వ్యాపారాలను డిజిటలైజ్ చేయడం, నాల్గవదిగా ప్రతి ఒక్కరికీ, ప్రతిచోటా ఏఐ (AI) సేవలను అందుబాటులోకి తేవడం ,ఐదవ లక్ష్యంగా స్వదేశీ సాంకేతిక పరిష్కారాలను ప్రపంచ మార్కెట్లకు పరిచయం చేయడం వంటి అంశాలను జియో నిర్దేశించుకుంది. ఇప్పటికే 13 మిలియన్ల గృహాలకు కనెక్టివిటీ అందించిన ‘జియోఎయిర్‌ఫైబర్’ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిక్స్‌డ్ వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ ఆపరేటర్‌గా అవతరించింది.

ఆర్థికంగానూ జియో సరికొత్త రికార్డులను సృష్టించింది. ఆర్థిక సంవత్సరం 2026 (FY26)లో జియో ప్లాట్‌ఫామ్స్ రూ. 1,46,885 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 14.6 శాతం ఎక్కువ. కంపెనీ చరిత్రలోనే తొలిసారిగా పన్ను అనంతర నికర లాభం రూ. 30,000 కోట్లు దాటి, 15.1 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. ఇదే సమయంలో వినియోగదారుల సగటు ఆదాయం (ARPU) రూ. 214కు పెరిగింది. జియో నెట్‌వర్క్‌పై మొత్తం డేటా ట్రాఫిక్ 30.8 శాతం వృద్ధితో 241 ఎక్సాబైట్‌లుగా నమోదై, ప్రపంచంలోనే అతిపెద్ద డేటా ఆపరేటర్లలో ఒకటిగా నిలిచింది. దేశంలో జియో 5జీ చందాదారుల సంఖ్య 268 మిలియన్లు దాటింది, ఇది చైనా వెలుపల ఒకే దేశంలో ఉన్న అత్యధిక 5జీ వినియోగదారుల సంఖ్య కావడం విశేషం.

ఈ వార్షిక సమావేశంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఒక చారిత్రాత్మక ప్రకటన చేశారు. జియో యొక్క ప్రతిష్టాత్మక 4 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 33,000 కోట్లు) ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) డ్రాఫ్ట్ పేపర్లకు ఆర్ఐఎల్ బోర్డు ఆమోదం తెలిపిందని, దీనిని త్వరలోనే మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI)కి సమర్పించనున్నట్లు ప్రకటించారు. ఇది భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా నిలిచే అవకాశం ఉంది. దీని ద్వారా వచ్చే నిధులు నేరుగా కంపెనీ వృద్ధికి ఉపయోగపడనున్నాయి. భారతదేశం కూడా అంతర్జాతీయ స్థాయి విలువ కలిగిన టెక్నాలజీ కంపెనీలను నిర్మించగలదని ఈ లిస్టింగ్ ప్రపంచానికి నిరూపిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

భూతలంపై నెట్‌వర్క్ పరిధిని విస్తరించిన జియో, ఇప్పుడు అంతరిక్షం నుండి దేశాన్ని అనుసంధానించేందుకు సిద్ధమైంది. సాంప్రదాయ నెట్‌వర్క్‌లు చేరని మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ అందించేందుకు శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ రంగానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రాబోయే 2-3 ఏళ్లలో భూమికి 650 కిలోమీటర్ల ఎత్తులో 1,600 నుండి 1,650 లో-ఎర్త్ ఆర్బిట్ (LEO) ఉపగ్రహాల సమూహాన్ని నిర్మించాలని యోచిస్తోంది. ఇందుకోసం దాదాపు 10 నుండి 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి అవసరమవుతుందని అంచనా. ఈ ప్రాజెక్ట్ కోసం అంతరిక్ష నియంత్రణ సంస్థ ‘ఇన్-స్పేస్’ (IN-SPACe)కు జియో ఇప్పటికే ప్రతిపాదనలు సమర్పించింది. ఈ భారీ శాటిలైట్ నెట్‌వర్క్ అందుబాటులోకి వస్తే, గ్లోబల్ దిగ్గజం స్టార్‌లింక్‌కు పోటీగా ఎల్‌ఈఓ (LEO) విభాగంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్ జియో సరికొత్త చరిత్ర సృష్టించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *