Skip to content
జాతీయం వార్తలు

ఈపీఎఫ్ ఖాతాదారులకు కీలక ప్రకటన..పీఎఫ్ ఖాతాల్లో 8.25% వడ్డీ జమ చేయనున్న EPFO

Prajapaksham 19 Jun 2026 1 నిమిషాల పఠనం జాతీయం
ఈపీఎఫ్ ఖాతాదారులకు కీలక ప్రకటన..పీఎఫ్ ఖాతాల్లో 8.25% వడ్డీ జమ చేయనున్న EPFO

EPFO to Credit 8.25% Interest to PF Accounts

దేశంలోని సుమారు 7 కోట్లకు పైగా ఉన్న ఉద్యోగుల భవిష్య నిధి (EPF) చందాదారులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఈపీఎఫ్ డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటును ఖరారు చేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారికంగా ఆమోదం తెలిపింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి తుది అనుమతి లభించడంతో, ఈ వడ్డీ మొత్తాన్ని చందాదారుల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను ఈపీఎఫ్‌ఓ (EPFO) కార్యాలయం త్వరలోనే ప్రారంభించనుంది. అంతా అనుకూలిస్తే ఈ జూన్ నెలాఖరు నాటికే ఉద్యోగుల ఖాతాల్లోకి వడ్డీ డబ్బులు వచ్చి చేరే అవకాశం ఉందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ఈపీఎఫ్ వడ్డీ రేట్లను నిర్ణయించే అత్యున్నత నిర్ణయాధికార సంస్థ ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్’ (CBT) గతంలో సిఫార్సు చేసిన 8.25 శాతం వడ్డీ రేటు ప్రతిపాదనకే కేంద్ర మంత్రిత్వ శాఖ ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాది మార్చి 2వ తేదీన కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగిన సీబీటీ కీలక సమావేశంలో 2025-26 సంవత్సరానికి కూడా పాత వడ్డీ రేటు అయిన 8.25 శాతాన్నే యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు. దీనితో ఈపీఎఫ్ వడ్డీ రేటు ఎటువంటి మార్పులు లేకుండా ఒకే శాతంతో కొనసాగడం ఇది వరుసగా మూడవ సంవత్సరం కావడం గమనార్హం.

గతంలో వడ్డీ డబ్బులు ఖాతాల్లో పడటానికి చాలా సమయం పట్టేది. కానీ ఈసారి ఈపీఎఫ్‌ఓ సరికొత్తగా అభివృద్ధి చేసిన అత్యాధునిక డిజిటల్ వ్యవస్థ (New Digital System) ద్వారా ఈ ప్రక్రియను నిర్వహించబోతున్నారు. సాంకేతిక పరమైన ఫార్మాలిటీస్ పూర్తి కాగానే, ఈ కొత్త డిజిటల్ నెట్‌వర్క్ సహాయంతో చందాదారులందరి ఖాతాల్లోనూ అత్యంత వేగంగా వడ్డీ సొమ్ము ఆటోమేటిక్‌గా జమ కానుంది. ప్రైవేట్ ,ప్రభుత్వ రంగ ఉద్యోగుల దీర్ఘకాలిక పొదుపుపై కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వేతన జీవుల్లో హర్షాన్ని నింపుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *