Skip to content
తెలంగాణ వార్తలు

వర్షాల కోసం తెలంగాణలో వరుణయాగం.. ఆగస్టు 10న నాగార్జునసాగర్‌లో ముహూర్తం ఫిక్స్

Prajapaksham 07 Aug 2026 0 నిమిషాల పఠనం తెలంగాణ
వర్షాల కోసం తెలంగాణలో వరుణయాగం.. ఆగస్టు 10న నాగార్జునసాగర్‌లో ముహూర్తం ఫిక్స్

Revanth Reddy

తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి నదులు, జలాశయాలు నిండాలని, రైతాంగం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక వరుణ యాగం నిర్వహించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆగస్టు 10న ఉమ్మడి నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ విజయ విహార్ ప్రాంగణంలో ఈ మహా క్రతువు వైభవంగా జరగనుంది.

ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులు.. ఎల్ నినో ప్రభావం తగ్గి, కృష్ణా, గోదావరి నదుల్లో సమృద్ధిగా జలప్రవాహం కొనసాగాలని, రాష్ట్రవ్యాప్తంగా పంటలు బాగా పండాలని ప్రత్యేక సంకల్పంతో ఈ యాగాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ఈ యాగంలో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంకు చెందిన వేద పండితులు, అర్చకులతో పాటు మొత్తం 108 మంది రుత్వికులు పాల్గొని 11 హోమకుండాల్లో వేదోక్తంగా వరుణ యాగాన్ని నిర్వహించనున్నారు. యాగం అనంతరం జరిగే పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొననున్నారు. రాష్ట్ర శ్రేయస్సు, సకాలంలో వర్షాలు, జలాశయాల నింపుదల, రైతుల సంక్షేమం కోసం ఈ మహా యాగాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని యాదగిరిగుట్ట దేవస్థానం పాలక మండలి చైర్మన్ వెల్లడించారు.