ఢిల్లీలో ఘోరం.. చేతబడి చేస్తోందనే అనుమానంతో.. పని మనిషిని బ్యాట్తో కొట్టి, కత్తితో పొడిచి చంపిన డాక్టర్!
Black Magic Suspicion Leads to Murder Allegation Against Delhi Doctor
దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత కలకలం రేపిన దారుణ ఉదంతం వెలుగులోకి వచ్చింది. తన కుటుంబ సభ్యులు తన మాట వినకుండా ఉండేందుకు ఇంట్లో పనిచేసే మహిళే కారణమని, ఆమె చేతబడి చేస్తోందనే అనుమానంతో ఒక ప్రముఖ డాక్టర్ ఆమెను కిరాతకంగా హత్య చేశాడు. గురువారం ఉదయం జరిగిన ఈ ఘోర ఘటనపై పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి వివరాలు వెల్లడించారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఢిల్లీకి చెందిన డాక్టర్ మనీష్ గుప్తా ఒక డెర్మటాలజిస్ట్ (చర్మవ్యాధుల నిపుణుడు)గా పనిచేస్తున్నాడు. అతడి భార్య టీనా గుప్తా కూడా వృత్తిరీత్యా డాక్టరే. వీరి ఇంట్లో మీనా అనే మహిళ చాలా కాలంగా పనిమనిషిగా ఉంటోంది. అయితే, ఇటీవల కాలంలో డాక్టర్ మనీష్ గుప్తాకు, అతడి భార్య, కుటుంబ సభ్యులకు మధ్య కొన్ని మనస్పర్ధలు తలెత్తాయి. ఇంట్లో వాళ్లంతా మనీష్ గుప్తా మాటలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం, అతడిని లెక్కచేయకపోవడం ప్రారంభించారు.
కుటుంబ సభ్యుల ప్రవర్తనలో వచ్చిన ఈ మార్పునకు పనిమనిషి మీనానే కారణమని మనీష్ బలంగా నమ్మాడు. ఆమె ఇంట్లోకి ‘నెగెటివ్ ఎనర్జీ’ని తీసుకువస్తోందని, తన భార్య తన మాట వినకుండా ఉండేలా చేతబడి చేస్తోందని భ్రమపడ్డాడు. ఈ క్రమంలోనే మీనాను పనిలోంచి తీసేయాలని భార్యకు పలుమార్లు చెప్పినప్పటికీ, ఆమె మనీష్ మాటలను పట్టించుకోకుండా మీనానే పనిలో కొనసాగించింది. దీంతో మీనాపై మనీష్ గుప్తా కక్ష పెంచుకున్నాడు.
గురువారం ఉదయం మనీష్ భార్య డాక్టర్ టీనా గుప్తా ఇంటి నుంచి బయటకు వెళ్ళింది. అదే సమయంలో పనిమనిషి మీనా ఎప్పటిలాగే ఇంటికి వచ్చి, బట్టలు ఉతికి ఆరేయడానికి మేడపైకి వెళ్లింది. ఆ సమయంలో ఇంట్లో మనీష్ ఒక్కడే ఉన్నాడు. అప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్న మనీష్ గుప్తా.. మేడపైకి వెళ్లి క్రికెట్ బ్యాట్తో మీనా తలపై బలంగా బాదాడు. ఆ దెబ్బకు ఆమె తీవ్ర గాయంతో కిందపడి గిలగిలా కొట్టుకుంటున్నా వదలకుండా, తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెను పలుమార్లు దారుణంగా పొడిచాడు.
తీవ్ర రక్తస్రావం కావడం వల్ల మీనా అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి ప్రాణాలు కోల్పోయింది. అయితే, హత్య చేసిన అనంతరం డాక్టర్ మనీష్ అక్కడి నుంచి పారిపోకుండా, పోలీసులు వచ్చి అరెస్టు చేసేవరకు ఆమె మృతదేహం వద్దే ఉండిపోయాడు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మీనా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, డాక్టర్ మనీష్ గుప్తాను అరెస్టు చేశారు. పోలీసుల ప్రాథమిక విచారణలో తానే ఈ హత్య చేసినట్లు డాక్టర్ అంగీకరించాడు. అంతేకాకుండా, మానసిక క్షోభతోనో ఏమో గానీ.. తనకు చట్టప్రకారం మరణశిక్ష వేయాలని పోలీసులను కోరాడు. అయితే, ఈ హత్య వెనుక కేవలం చేతబడి అనుమానమే ఉందా లేదా కుటుంబంలో మరేదైనా బలమైన కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.