భార్యను దారుణంగా టార్చర్ పెట్టిన భర్త.. గాయాలు చూసి పోలీసులే షాక్.. నిందితుడు అరెస్గ్..
Beaten, Branded by Husband: Woman Escapes, Walks to Police With Chain on Neck
మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లాలో కట్టుకున్న భర్త ఒక మహిళపై సాగించిన క్రూరమైన హింస, ఆమె ధైర్యంగా ఆ బందీఖానా నుండి తప్పించుకున్న వైనం సినిమా క్రైమ్ థ్రిల్లర్ను తలపిస్తోంది. బాధితురాలు మాంగీబాయి తన్వర్ పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 10వ తేదీ రాత్రి ఆమె భర్త సర్దార్ సింగ్ తన్వర్ మద్యం సేవించి ఇంటికి వచ్చి, భోజనం తర్వాత ఆమెతో గొడవకు దిగాడు. ఆమె దీనిని వ్యతిరేకించడంతో కర్రతో బాది, చెంపదెబ్బలు కొడుతూ క్రూరంగా దాడి చేశాడు. ఈ వేధింపులను భరించలేక, ఆమె రాత్రి వేళ ఎవరికీ తెలియకుండా ఇల్లు వదిలి పోలీసులను ఆశ్రయించడానికి బయలుదేరింది.
అయితే, ఖిల్చిపూర్ పోలీస్ స్టేషన్ వైపు నడుచుకుంటూ వెళ్తున్న ఆమెను దారిలో ఒక గుడి సమీపంలో భర్త అడ్డుకున్నాడు. మళ్లీ ఆమెపై దాడి చేసి బలవంతంగా గ్రామానికి తీసుకువచ్చి, మరింత క్రూరంగా ప్రవర్తించాడు. చేతనైతే పోలీసులకు ఫిర్యాదు చేయాలంటూ సవాలు విసిరి.. దాదాపు 24 గంటల పాటు ఆమె మెడకు ఇనుప గొలుసు వేసి, ఇంట్లోని ఒక స్తంభానికి కట్టేసి తాళం వేశాడు. అంతటితో ఆగకుండా, గ్యాస్ స్టవ్ మీద ఇనుప రాడ్ను ఎర్రగా కాల్చి ఆమె నడుము, తొడ భాగాలపై వాతలు పెట్టాడు. ఆమె నొప్పితో కేకలు వేసినా చుట్టుపక్కల వారు ఎవరూ సాయానికి రాలేదు. పోలీసుల వద్దకు వెళ్లే ఆలోచనను విరమించుకునేలా ఆమెపై ఒత్తిడి తెచ్చేందుకు, ఊరి పెద్దలతో పంచాయితీ పెట్టాలనే ఉద్దేశంతో ఆమెను ఇంట్లోనే బంధించి బయటకు వెళ్లాడు. ఆ సమయంలో ఆమె ప్రాణభయంతో రాజీకి అంగీకరించినట్లు నటించి, తప్పించుకోవడానికి అవకాశం కోసం ఎదురుచూసింది.
భర్త బయటకు వెళ్లగానే మాంగీబాయి చుట్టూ వెతకగా ఒక రాయి కనిపించింది. దాంతో తాళం పగిలేవరకు పదే పదే కొట్టి, గొలుసును తెంచుకుని బందీఖానా నుండి విముక్తి పొందింది. క్షణం కూడా వృధా చేయకుండా, మెడలో ఇనుప గొలుసు, తెగిన తాళం అలాగే వేలాడుతుండగా చీకట్లోనే ఖిల్చిపూర్ వైపు పరుగు తీసింది. నిర్మానుష్యమైన ప్రాంతాలు, పొలాల గుండా దాదాపు ఆరు కిలోమీటర్ల మేర నడిచింది. దారిలో ముళ్ళు గుచ్చుకుని, కాళ్ళు తెగి రక్తం కారుతున్నా ఆమె ప్రయాణం ఆపలేదు. దారిలో వెళ్లేవారు ఆమె మెడలోని గొలుసును చూసి పిచ్చిదేమో అనుకుని వదిలేసినా, ఒక బాటసారి మాత్రం ఆమె పరిస్థితిని గమనించి తినడానికి ఆహారం ఇచ్చాడు.
చివరకు రాత్రి 10 గంటల ప్రాంతంలో తీవ్ర అలసటతో, ఒళ్లంతా గాయాలతో వణికిపోతూ మాంగీబాయి ఖిల్చిపూర్ పోలీస్ స్టేషన్ గడప తొక్కింది. మెడలో తాళం వేసిన గొలుసుతో ఉన్న ఆమెను చూసి పోలీసులు సైతం షాక్కు గురయ్యారు. ఆమె కన్నీరుమున్నీరవుతూ జరిగిన దారుణాన్ని వివరించడంతో, పోలీసులు వెంటనే ఆమె మెడలోని గొలుసును తొలగించి, వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో ఆమె శరీరంపై ఉన్న తీవ్రమైన గాయాలు, వాతలు నిజమేనని నిర్ధారణ అయింది. స్పందించిన పోలీసులు తక్షణమే ఒక బృందాన్ని గ్రామానికి పంపి, నిందితుడైన భర్త సర్దార్ సింగ్ తన్వర్ను అరెస్టు చేశారు. బాధితురాలి సాహసోపేతమైన ముందడుగు చివరకు ఆ క్రూరుడిని జైలు పాలు చేసింది.