Prashant Kishor: విపక్షాల ఐక్యత అంశంపై ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు.. నాకు అంత సమయం లేదంటూ..
Prashant Kishor
బీహార్లోని బంకీపూర్ ఉపఎన్నికలో ఘన విజయం సాధించిన అనంతరం జన్ సురాజ్ వ్యవస్థాపకుడు Prashant Kishor సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రతిపక్ష ఐక్యత గురించి ఆలోచించే సమయం కాదు. మా పూర్తి అజెండా బీహార్ అభివృద్ధి మాత్రమేనని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల సమస్యలను పరిష్కరించడం, ప్రత్యామ్నాయ రాజకీయాలను బలోపేతం చేయడమే తమ లక్ష్యమని పేర్కొంటూ.. జాతీయ రాజకీయాల కంటే బీహార్పైనే తన దృష్టి కేంద్రీకృతమై ఉందని వెల్లడించారు.
Prashant Kishor: బీహార్లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన బంకిపూర్ శాసనసభ ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ (BJP) పై జన సూరజ్ పార్టీ (JSP) అధినేత ప్రశాంత్ కిషోర్ ఘన విజయాన్ని నమోదు చేశారు. విజయం సాధించిన మరుసటి రోజే ఆయన నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇకపై బంకిపూర్ ప్రజాప్రతినిధి వల్ల ఎప్పుడూ అవమానపడదని ధీమా వ్యక్తం చేశారు.
గతంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్తగా సేవలందించి, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందిన ప్రశాంత్ కిషోర్.. తన సమీప బీజేపీ అభ్యర్థిపై ఏకంగా 19,000 ఓట్లకు పైగా భారీ మెజారిటీతో విజయం సాధించి.. బంకిపూర్ సరికొత్త ఎమ్మెల్యేగా శాసనసభలోకి అడుగుపెట్టబోతున్నారు.
విజయం అనంతరం ఎన్డిటివి (NDTV)కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కిషోర్ మాట్లాడుతూ.. బంకిపూర్లో తక్షణమే అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామని హామీ ఇచ్చారు. వచ్చే మూడు నెలల్లోనే బంకిపూర్లో మీరు స్పష్టమైన మార్పును గమనిస్తారు. స్థానిక స్థాయిలో పేరుకుపోయిన అవినీతిని పూర్తిగా అంతం చేస్తానని ఇక్కడి ప్రజలకు వాగ్దానం చేస్తున్నానని పేర్కొన్నారు.
వాస్తవానికి బంకిపూర్ నియోజకవర్గం దశాబ్దాలుగా బీజేపీకి బలమైన కంచుకోటగా ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న బీజేపీ నూతన అధ్యక్షుడు నితిన్ నబిన్ ఇటీవల రాజ్యసభకు ఎన్నికవ్వడంతో ఈ సీటు ఖాళీ అయింది. దీంతో జరిగిన ఈ ఉప ఎన్నికను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ, ప్రశాంత్ కిషోర్ అక్కడ జయకేతనం ఎగరవేశారు.
బంకిపూర్ ఓటర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన కిషోర్, విద్యుత్, విద్యా రంగాలను మెరుగుపరచడం మరియు స్థానికంగా ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని చెప్పారు. బీహార్లోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేలా బంకిపూర్లో ఒక ప్రత్యేక ప్రయోగాన్ని ప్రారంభించబోతున్నాను. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడకపోతే, పేద పిల్లలందరికీ ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకునేలా సౌకర్యాలు కల్పిస్తాననని హామీ ఇచ్చారు. బీహార్ నుండి యువత వలసలను అరికట్టడం, నాణ్యమైన విద్యను అందించడమే ధ్యేయంగా పనిచేసే ప్రభుత్వం రాష్ట్రానికి అవసరమని వ్యాఖ్యానించారు.
గతంలో జరిగిన ఎన్నికల్లో లభించిన ఫలితాలపై స్పందిస్తూ.. తాము గత మూడేళ్లుగా ప్రజల్లో ఉంటూ అవిశ్రాంతంగా పనిచేశామని, దానికి బంకిపూర్ ప్రజలు ఇప్పుడు తగిన ప్రతిఫలాన్ని ఇచ్చారని హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని మొత్తం 422 పోలింగ్ బూత్లలో దాదాపు మూడింట రెండు వంతుల బూత్లలో బీజేపీ ఓడిపోవడమే దీనికి నిదర్శనమన్నారు. కులాలు, వర్గాలకు అతీతంగా ప్రజలు జేఎస్పీకి ఓటు వేశారని చెప్పారు.
ఇతర రాష్ట్రాల్లో ప్రతిపక్షాల ఐక్యత గురించి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. నా దృష్టి ఎప్పుడూ బీహార్ అభివృద్ధిపైనే ఉంటుంది కానీ, జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యతపై కాదు. ప్రస్తుతం బీహార్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం, ఇక్కడ అలాంటి వ్యూహాల అవసరం లేదని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు.
- హైదరాబాద్లో కల్తీ మసాలాల గుట్టురట్టు.. 25 టన్నుల కల్తీ మిర్చి, పసుపు, ధనియాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్
- Prashant Kishor: విపక్షాల ఐక్యత అంశంపై ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు.. నాకు అంత సమయం లేదంటూ..
- UK Crime: పెన్షన్ డబ్బుల కోసం తల్లి మృతదేహాన్ని మూడేళ్లు ఫ్రీజర్లో దాచిన కొడుకు..
- Chandipura Virus: చండీపుర వైరస్ ఎలా వ్యాపిస్తుంది.. దీని లక్షణాలు, చికిత్స ఏమిటి.. గుజరాత్లో 22 మంది చిన్నారులు మృతి..
- Faridabad Horror: అర నిమిషంలో 30 కత్తిపోట్లు.. స్కూలులోనే మహిళా టీచర్పై దాడి చేసిన కిరాతకుడు..