Skip to content
ఆంధ్రప్రదేశ్ వార్తలు

వైసీపీలోకి విజయ్ సాయి రెడ్డి రీఎంట్రీ..? ఆయనొస్తే సజ్జలకు ఎగ్జిట్ తప్పదా..?

Prajapaksham 04 Aug 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
వైసీపీలోకి విజయ్ సాయి రెడ్డి రీఎంట్రీ..? ఆయనొస్తే సజ్జలకు ఎగ్జిట్ తప్పదా..?

వైసీపీలోకి విజయ్ సాయి రెడ్డి రీఎంట్రీ..? ఆయనొస్తే సజ్జలకు ఎగ్జిట్ తప్పదా..?

గత కొన్ని రోజులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి రాజకీయాల్లో రీఏంట్రి కోసం పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఆయన సొంత పార్టీ పెడతారని ఒక వార్త షికారు చేస్తుంటే కాదు వైసీపీలోకి రీఎంట్రీ ఇస్తారనే వార్త ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. విజయ్ సాయి రెడ్డి గతంలో తన రాజ్యసభ సభ్యత్వానికి, రాజకీయాలకు దూరమైనప్పటికీ.. మళ్లీ రీ-ఎంట్రీ ఇస్తానని పలుమార్లు స్పష్టం చేయడంతో ఇఫ్పుడు ఆయన నిర్ణయం కోసం రాజకీయ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు సాయి రెడ్డి గతంలో సూచనప్రాయంగా వెల్లడించడంతో పాటు, సొంతంగా డిజిటల్ మీడియా వేదికను కూడా సిద్ధం చేసుకుంటున్నారని, ఆయన రీ-ఎంట్రీ ఖాయమనే ప్రచారం జోరందుకుంది.

ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డి మళ్లీ వైసీపీ వైపే అడుగులు వేస్తున్నారని, పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో కూడా సంప్రదింపులు జరిపినట్లు సైతం రాజకీయ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ తీవ్ర పరాజయాన్ని చవిచూసినప్పటి నుంచి పార్టీ అనేక సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఢిల్లీ స్థాయిలో పార్టీ వ్యవహారాలను చక్కబెట్టడంలోనూ, ప్రతిపక్షాల దాడిని తిప్పికొట్టడంలోనూ వైసీపీలో స్పష్టమైన లోటు కనిపిస్తోంది.

సరైన పొలిటికల్ స్ట్రాటజీలు లేక జగన్ తరచూ ఇరకాటంలో పడుతుండటంతో, గతంలో నంబర్-2గా వ్యవహరించిన విజయసాయిరెడ్డి అవసరం మళ్లీ ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విజయసాయిరెడ్డి వంటి పదునైన వ్యూహకర్త పార్టీకి ఎంతైనా అవసరమని తాడేపల్లి వర్గాలతో పాటు పార్టీ కేడర్ కూడా భావిస్తోంది.

రాజకీయాలకు దూరంగా ఉన్న సమయంలో తలెత్తిన పొలిటికల్ గ్యాప్ తనకు మైలేజ్ ఇవ్వలేదని భావించిన సాయిరెడ్డి, ఉనికి చాటుకోవడానికి యాక్టివ్ పాలిటిక్స్ తప్పనిసరి అని గ్రహించారు.
వైఎస్ కుటుంబంతో ఉన్న సుదీర్ఘ అనుబంధం, పార్టీ నిర్మాణంలో పోషించిన కీలక పాత్ర వల్ల పాత విభేదాలను పక్కనబెట్టి సంధి ప్రయత్నాలు మొదలైనట్లు తెలుస్తోంది.

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో జగన్, విజయసాయిరెడ్డి ఇద్దరికీ ఒకరి అవసరం మరొకరికి ఉండటమే ఈ చర్చలు ముందుకు సాగడానికి ప్రధాన కారణం. అయితే విజయసాయిరెడ్డి గతంలో రాజీనామా చేసినప్పుడు వైసీపీ వేదికల నుంచే ఆయనపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చినందున, ఈ రీ-ఎంట్రీ అంత సులభం కాదనే అభిప్రాయాలు ఉన్నాయి. సాయిరెడ్డికి మళ్లీ పూర్వ వైభవం, పాత హోదా కల్పిస్తే పార్టీ అంతర్గతంగా ఎలాంటి ప్రతిఘటన ఎదురవుతుందోననే ఆసక్తి నెలకొంది.

ఒకవేళ ఇరువర్గాల మధ్య చర్చలు ఫలించి రాజీ కుదిరితే రాబోయే రెండు మూడు నెలల్లోనే ఆయన మళ్లీ వైసీపీ గూటికి చేరే అవకాశాలు ఉన్నాయి. విజయసాయిరెడ్డి పునరాగమనం నిజమైతే ఢిల్లీ స్థాయిలో పార్టీ గొంతును వినిపించడానికి, ఏపీలో రాజకీయ వ్యూహాలను అమలు చేయడానికి ఆయన అనుభవం ఉపయోగపడుతుంది. ఒకవేళ విజయసాయిరెడ్డి తాడేపల్లి ప్యాలెస్‌లోకి మళ్లీ ఎంట్రీ ఇస్తే, ప్రస్తుతం కీలక పాత్ర పోషిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డికి ఎగ్జిట్ తప్పదనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.