యువ ఆటగాడిపై సౌరవ్ గంగూలీ తాజా వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశి న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్..
రాజస్థాన్ రాయల్స్ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ భారత టీ20 జట్టుకు ఎంపికై సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో పాటు ఏషియన్ గేమ్స్కు ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకోవడంతో, భారత సీనియర్ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా సచిన్ టెండూల్కర్ రికార్డును వైభవ్ అధిగమించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.
వైభవ్ సూర్యవంశీపై ఇప్పుడే అంచనాల భారం మోపవద్దని సౌరవ్ గంగూలీ సూచించాడు. అతడికి ఇంకా 15 ఏళ్లే కాబట్టి, అంతర్జాతీయ క్రికెట్కు అలవాటు పడటానికి కొంత సమయం ఇవ్వాలని, స్వేచ్ఛగా ఆడనివ్వాలని దాదా అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ ఆడే పరిస్థితులకు, యూకే (UK) వాతావరణానికి చాలా వ్యత్యాసం ఉంటుందని, అక్కడ బంతి సీమ్, బౌన్స్ అవ్వడం వల్ల కొత్త బంతిని ఎదుర్కోవడం బ్యాటర్లకు సవాలుగా మారుతుందని గంగూలీ పేర్కొన్నాడు. అయినప్పటికీ, వైభవ్ నైపుణ్యంపై తనకు నమ్మకం ఉందని, అతను అక్కడ కూడా రాణిస్తాడని ఆశిస్తున్నట్లు తెలిపాడు.
మరోవైపు, గంగూలీ వ్యాఖ్యలతో ఏబీ డివిలియర్స్ ఏకీభవించలేదు. వైభవ్కు వయసు చిన్నదైనా, అనుభవం తక్కువైనా.. తన అసాధారణ ఆట తీరుతో సెలక్షన్ కమిటీ తలుపులు బద్దలు కొట్టి మరీ జట్టులోకి వచ్చాడని డివిలియర్స్ ప్రశంసించాడు. అతనిలోని ప్రతిభే అతన్ని ఈ స్థాయికి చేర్చిందని కొనియాడాడు. ఇప్పటికే భారత అండర్-19 జట్టు తరపున ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా వంటి కఠినమైన విదేశీ పిచ్లపై ఆడి తనను తాను నిరూపించుకున్న వైభవ్, ఇప్పుడు సీనియర్ జట్టులో ఏ మేరకు రాణిస్తాడోనని క్రికెట్ లోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.