Skip to content
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆంధ్రాలోనే సీఎం అయ్యే దిక్కులేదు… ఇక తెలంగాణలో ముఖ్యమంత్రిని అవుతానా?: పవన్ కల్యాణ్

Prajapaksham 02 Jun 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
ఆంధ్రాలోనే సీఎం అయ్యే దిక్కులేదు… ఇక తెలంగాణలో ముఖ్యమంత్రిని అవుతానా?: పవన్ కల్యాణ్

I Couldn't Become Andhra CM, How Can I Become Telangana CM?” – Pawan Kalyan

నాకు ఆంధ్రప్రదేశ్‌లోనే ముఖ్యమంత్రి అయ్యే దిక్కు లేదు, ఇక తెలంగాణలో ఎందుకు అవుతాను?” అని జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రాజకీయ లబ్ధి కోసమే తాము ప్రయత్నిస్తున్నామంటూ ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తనను, జనసేన పార్టీని లక్ష్యంగా చేసుకుని కొందరు నాయకులు పనిగట్టుకుని ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఒక రాజకీయ పార్టీని దేశంలో ఎక్కడైనా పెట్టుకునే హక్కు రాజ్యాంగం కల్పించిందని, గతంలో కేసీఆర్ ‘భారత రాష్ట్ర సమితి’ (BRS) పార్టీని ఆంధ్రాలో ప్రారంభించినప్పుడు తాను మనస్ఫూర్తిగా స్వాగతించానని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. గుంటూరులో బీఆర్ఎస్ కార్యాలయం పెట్టి, గతంలో జనసేనలో పనిచేసిన నాయకుడిని దానికి అధ్యక్షుడిగా నియమించినా తాము ఆహ్వానించామని చెప్పారు. అలాంటప్పుడు, జనసేన తెలంగాణలో అడుగుపెట్టకూడదు అనడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. తామేమీ తెలంగాణలో పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడని ఇక్కడికి రావడం లేదని, ఆంధ్రాలోనే తనకు ఆ దిక్కు లేనప్పుడు ఇక్కడ ఆశ ఎందుకు ఉంటుందని వ్యాఖ్యానించారు.

నిజానికి తాము వస్తే ప్రజలను చైతన్యవంతులను చేస్తామని, సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామనే భయం మాత్రమే ఇక్కడి పాలకులకు ఉందని పవన్ కల్యాణ్ విమర్శించారు. కేవలం 2,000 మందితో ఒక ఇండోర్ సభ పెట్టుకుంటామంటే కూడా పర్మిషన్ ఇవ్వకపోతే ఏం చేయాలని నిలదీశారు. తాను కేంద్ర మంత్రి అమిత్ షా గారి గురించి మాట్లాడితే, దానికి ప్రాంతీయత మరియు కులం రంగులు పులిమి అవమానిస్తున్నారని మండిపడ్డారు. తమ ఇష్టానికి తాము మాట్లాడితే కనీసం బాధపడే హక్కు కూడా ఉండదా అని ఆవేదన వ్యక్తం చేశారు. తామేమీ ఇంకా “బాంచన్ దొర, నీ కాళ్లు మొక్కుతా” అని బతకడానికి సిద్ధంగా లేమని, పీకలు కోసుకుంటాం కానీ అలాంటి భయంతో బతకలేమని స్పష్టం చేశారు.

తెలంగాణలో ఆంధ్ర కాంట్రాక్టర్లు, ఆంధ్రాలో తెలంగాణ కాంట్రాక్టర్లు ఎంతో బాగున్నారని, వాళ్ల వ్యాపారాలు, అధికారాలు అన్నీ సజావుగా సాగుతున్నాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మధ్యలో నాలాంటి వాడిని మాట్లాడనివ్వకుండా చేసి, ప్రజలను బేవకూఫ్‌లను చేస్తున్నారని, ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని కోరారు. నిజంగానే తాను తెలంగాణకు రావొద్దని అనుకుంటే, అసెంబ్లీలో పవన్ కల్యాణ్ ఇక్కడ అడుగుపెట్టకూడదని తీర్మానం ప్రవేశపెట్టాలని, అది ఎలా చేస్తారో తాను కూడా చూస్తానని సవాల్ విసిరారు. ఒకప్పుడు తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించిన వాళ్లే ఈరోజు అక్కడ పెద్ద పెద్ద పదవుల్లో కూర్చున్నారని విచిత్రమైన పరిస్థితిని ఎండగట్టారు.

తెలంగాణ ఉద్యమంలో 1,200 మందికి పైగా యువత ప్రాణాలు అర్పించారని, వాళ్ల త్యాగాలంటే తనకు ఎంతో గౌరవమని, తెలంగాణ అంటే తనకు ప్రాణమని పవన్ అన్నారు. కానీ కొందరు తన ప్రేమనే శంకిస్తున్నారని, అందుకే ఇప్పటిదాకా తీసుకోని ఒక గట్టి నిర్ణయం ఇప్పుడు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇకపై తెలంగాణలో జనసేన కచ్చితంగా ఉంటుందని, రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తుందని సంచలన ప్రకటన చేశారు. తానే స్వయంగా ఇక్కడ పర్యటించి, ప్రతి సమస్యపై మాట్లాడుతామని, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం అని మర్చిపోవద్దని, బెరిరిస్తే భయపడే ప్రసక్తే లేదని, దశాబ్దాలుగా భరించామని, ఇకపై అలాంటి ధోరణులకు చరమగీతం పాడుతామని హెచ్చరించారు.

తెలంగాణ ఉద్యమం ఊపందుకోక ముందు నుంచే తనకు ఇక్కడి సంస్కృతి, పోరాట స్ఫూర్తి అంటే ఎంతో ఇష్టమని, దానిని తన సినిమాల్లోనూ చూపించానని గుర్తుచేశారు. కొందరు నాయకులు తనను భౌతికంగా అడ్డుకుంటామని, దాడులు చేస్తామని బెదిరిస్తున్నారని, చావుకు సిద్ధపడే తాను పార్టీ పెట్టానని, అలాంటి బెదిరింపులకు భయపడనని స్పష్టం చేశారు. ప్రాంతీయ విద్వేషాలు దేశ సమగ్రతకు ఉగ్రవాదం కంటే ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ ఉపాధి లేకపోతే, పరిశ్రమలు రాకపోతే దానికి ఆంధ్రోళ్లే కారణం అన్నట్టు మాట్లాడటం సరికాదని, నాయకుల మధ్య ఉండే రాజకీయ విభేదాలను ప్రజలకు అంటించవద్దని పవన్ కల్యాణ్ హితవు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *