Skip to content
ప్రపంచం వార్తలు

హార్ముజ్ తర్వాత మరో కీలక జలసంధిపై ఇరాన్ పట్టు..ప్రపంచ వాణిజ్య మార్గంపై మళ్లీ ఆందోళన..

Prajapaksham 02 Jun 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
హార్ముజ్ తర్వాత మరో కీలక జలసంధిపై ఇరాన్ పట్టు..ప్రపంచ వాణిజ్య మార్గంపై మళ్లీ ఆందోళన..

After Hormuz Tensions, Iran Eyes Bab el-Mandeb: What It Means for World Trade

మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు మరోసారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసే ప్రమాదం కనిపిస్తోంది. లెబనాన్‌లో ఇజ్రాయెల్ తన సైనిక చర్యలను మరింత విస్తృతం చేయడంపై ఇరాన్, దాని మిత్రపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే హార్ముజ్ జలసంధి గుండా సాగే చమురు, వాణిజ్య రవాణాకు అంతరాయం కలిగించిన ఇరాన్ కూటమి, ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే నౌకా మార్గాలలో ఒకటైన ‘బాబ్ అల్-మండేబ్’ జలసంధిని కూడా లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది.

లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అమెరికాతో జరుగుతున్న పరోక్ష చర్చలను నిలిపివేస్తున్నట్లు ఇరాన్ ప్రభుత్వ అనుబంధ మీడియా ప్రకటించింది. అయితే ఈ చర్చల విఫలంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. తనకు ఆ చర్చలతో పట్టింపు లేదని తేల్చి చెప్పారు. కాగా, హిజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య పాక్షిక కాల్పుల విరమణ కుదిరినట్లు అమెరికా, లెబనాన్ ధృవీకరించినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.

దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనిక చర్యలు కొనసాగుతాయని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. తమ భూతల దళాలు గత 25 ఏళ్లలోనే అత్యంత లోతుగా లెబనాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి జహరానీ నది వైపుగా ముందుకు సాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. గాజా, లెబనాన్‌లలో దాడులు ఆపనంత వరకు ఎలాంటి చర్చలు సాధ్యం కాదని ఇరాన్ పునరుద్ఘాటించడం చూస్తే ఈ సంక్షోభం త్వరలో ముగిసేలా కనిపించడం లేదు. యుద్దం ఇలాగే సాగితే బాబ్ అల్-మండేబ్ జలసంధి గుండా రవాణా మరోసారి ప్రమాదంలో పడే అవకాశం ఉంది.

యెమెన్ మరియు ఆఫ్రికా ఖండపు కొమ్ము ప్రాంతాల మధ్య, ఎర్ర సముద్రపు దక్షిణ ప్రవేశద్వారం వద్ద ఉన్న ఈ బాబ్ అల్-మండేబ్ జలసంధి అత్యంత ఇరుకైనదైనప్పటికీ ప్రపంచ వాణిజ్యంలో అత్యంత కీలకపాత్ర పోషిస్తోంది. ఇది సూయజ్ కాలువకు ప్రవేశ ద్వారంగా ఉంటూ ఆసియా, యూరప్, ఆఫ్రికా ఖండాలను కలుపుతుంది. ప్రపంచ సముద్ర వాణిజ్యంలో దాదాపు 15 శాతం ఈ మార్గం గుండానే సాగుతుంది. ఈ జలసంధి మూతపడినా లేదా ప్రమాదంలో పడినా అంతర్జాతీయ సరుకు రవాణా నౌకలు, చమురు ట్యాంకర్లు ఆఫ్రికాలోని ‘కేప్ ఆఫ్ గుడ్ హోప్’ చుట్టూ వేలాది మైళ్ల అదనపు దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. దీనివల్ల రవాణా సమయం, ఇంధన ఖర్చులు విపరీతంగా పెరిగిపోయి ఆ భారం అంతిమంగా వినియోగదారులపై పడుతుంది.

బాబ్ అల్-మండేబ్ జలసంధికి ముప్పు వాటిల్లితే, ఆ ప్రాంతంలో ఇరాన్‌కు అత్యంత సన్నిహిత మిత్రపక్షమైన యెమెన్‌కు చెందిన ‘హౌతీ’ రెబల్స్ రంగంలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో 2023లో గాజా యుద్ధానికి నిరసనగా హౌతీలు ఈ జలసంధి గుండా వెళ్లే వాణిజ్య నౌకలపై దాడులు చేశారు. ఆ అంతరాయాల వల్ల 2023 నుండి 2025 మధ్య ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఏటా సుమారు 20 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని పరిశ్రమల అంచనా.

తాజాగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఖుద్స్ ఫోర్స్ కమాండర్ ఇస్మాయిల్ ఖానీ మాట్లాడుతూ, అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల వల్ల ప్రతిఘటన కూటమి ఇతర రంగాలను కూడా క్రియాశీలం చేస్తుందని హెచ్చరించారు. బాబ్ అల్-మండేబ్ జలసంధిని కూడా హోర్ముజ్ జలసంధి లాగా మారుస్తామని, ఇజ్రాయెల్ చర్యలు దానిని హిజ్బుల్లా, పాలస్తీనా ప్రతిఘటనల సుడిగుండంలోకి నెట్టేస్తాయని అన్నారు.

హౌతీ సీనియర్ అధికారి మహమ్మద్ మన్సూర్ కూడా బాబ్ అల్-మండేబ్‌ను పూర్తిగా మూసివేయడం ఒక ఆచరణీయమైన ఎంపికేనని, దాని పర్యవసానాలను అమెరికా, ఇజ్రాయెల్‌లే భరించాల్సి ఉంటుందని గతంలోనే హెచ్చరించారు. మొత్తానికి ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ కూటమి వ్యూహాలు, అంతర్జాతీయ ఇంధన సరఫరాలు మరియు ప్రపంచ వాణిజ్య మార్గాలను తీవ్ర అంధకారంలోకి నెట్టేసే ప్రమాదం పొంచి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *