దక్షిణాసియాలో భారీ వలసలు.. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి 1.9 కోట్ల మంది గల్ఫ్ దేశాలకు..
19 Million People Have Migrated Across India, Pakistan and Bangladesh
దక్షిణాసియా దేశాల నుంచి బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లే వారి సంఖ్యపై జర్నల్ నేచర్లో ఒక ఆసక్తికరమైన అధ్యయనం ప్రచురితమైంది. ‘ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అప్లయిడ్ సిస్టమ్స్ అనాలిసిస్’ మరియు ‘పాపులేషన్ అండ్ జస్ట్ సొసైటీస్ ప్రోగ్రామ్’కు చెందిన పరిశోధకుడు గై అబెల్ నేతృత్వంలో సాగిన ఈ సర్వే ప్రకారం, 2010వ సంవత్సరం తర్వాత భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ల నుంచి సుమారు 1.90 కోట్ల మంది గల్ఫ్ దేశాలకు వలస వెళ్లినట్లు తేలింది. వీరంతా ఉపాధి అవకాశాల కోసమే ప్రధానంగా సౌదీ అరేబియా, ఖతార్, బహ్రెయిన్, యూఏఈ (దుబాయ్) వంటి పశ్చిమాసియా దేశాలకు తరలివెళ్లారు.
ఈ వలసల సరళిని పరిశీలిస్తే, దక్షిణాసియా దేశాలతో పాటు ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన వారే గల్ఫ్ ప్రాంతంలో ఎక్కువగా స్థిరపడుతున్నారని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. మూడు దేశాల నుంచి ఏడాదికి సరాసరిన 13.5 లక్షల మంది చొప్పున గల్ఫ్ బాట పడుతుండగా, కేవలం బంగ్లాదేశ్ నుంచే 2010 తర్వాత ప్రతి ఏటా సగటున 3 లక్షల మంది చొప్పున సౌదీ అరేబియాకు వలస వెళ్లినట్లు నివేదిక ప్రత్యేకంగా ప్రస్తావించింది.
ఈ సుదీర్ఘ వలసలకు గల కారణాలను విశ్లేషిస్తూ, స్వదేశాల్లో అకస్మాత్తుగా తలెత్తిన తాత్కాలిక ఆర్థిక లేదా రాజకీయ సంక్షోభాల వల్ల ఈ వలసలు జరగడం లేదని పరిశోధకులు వెల్లడించారు. గల్ఫ్ దేశాలలో ఉన్న ఉపాధి అవకాశాలు, అక్కడి మెరుగైన జీవన ప్రమాణాల ఆకర్షణ కారణంగానే దశాబ్దాలుగా ఈ వలసల ప్రక్రియ నిరంతరాయంగా, దీర్ఘకాలికంగా కొనసాగుతోందని ఈ అధ్యయన పత్రం స్పష్టం చేసింది.