Skip to content
తెలంగాణ వార్తలు

Hyderabad GST Scam: హైదరాబాద్‌లో భారీ సైబర్ మోసం: రూ.183.61 కోట్ల నకిలీ జీఎస్టీ బిల్లుల సృష్టి..

jagan 30 Aug 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Hyderabad GST Scam: హైదరాబాద్‌లో భారీ సైబర్ మోసం: రూ.183.61 కోట్ల నకిలీ జీఎస్టీ బిల్లుల సృష్టి..

Cyber Fraud

Hyderabad GST Scam: హైదరాబాద్ నగరంలో దిగ్భ్రాంతికరమైన సైబర్ నేరం వెలుగుచూసింది. ఓ ప్రముఖ వ్యాపార సంస్థకు చెందిన జీఎస్టీ (GST) ఖాతాను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు, ఏకంగా రూ. 183.61 కోట్ల విలువైన నకిలీ ఇన్వాయిస్‌లను సృష్టించారు. అక్రమంగా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) పొంది, ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టేందుకు యత్నించిన ఈ ఘరానా మోసం వ్యాపార వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.

నల్లగొండ జిల్లా చిట్యాలకు చెందిన నిఖిల్ రెడ్డి, అనంతరెడ్డి అనే సోదరులు హయత్‌నగర్ ప్రాంతంలో ‘యుక్తా ఫ్లైవుడ్ అండ్ హార్డ్‌వేర్’ పేరుతో వ్యాపారం చేస్తున్నారు. ఆగస్టు 3న ఆ సంస్థ అకౌంటెంట్ జీఎస్టీ పోర్టల్‌లో లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించగా ప్రవేశం లభించలేదు. అనుమానంతో పరిశీలించగా, జులై 23వ తేదీనే గుర్తుతెలియని వ్యక్తులు ఆ కంపెనీ జీఎస్టీ ఖాతాకు లింక్ అయిన మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీలను మార్చేసి ఖాతాను హ్యాక్ చేసినట్లు గుర్తించారు.

వెంటనే యజమానులు జీఎస్టీ అధికారులను ఆశ్రయించగా, అధికారులు ఖాతాను పునరుద్ధరించారు. ఆ తర్వాత పరిశీలించగా హ్యాకర్లు సదరు ఖాతా ఉపయోగించి ఏకంగా 730 నకిలీ ఇన్వాయిస్‌లు, ఈ-వే బిల్లులు సృష్టించినట్లు తేలింది.

ధన్‌శ్రీ ఎంటర్‌ప్రైజెస్, ట్రస్ట్ ట్రేడర్స్, హిందుస్థాన్ ట్రేడర్స్ వంటి పలు నకిలీ/షెల్ కంపెనీల పేర్లతో ఈ బిల్లులను తయారు చేశారు. సాధారణంగా కొత్తగా నకిలీ జీఎస్టీ నంబర్లను సృష్టించి మోసాలు చేసే సైబర్ నేరగాళ్లు, ఈసారి శైలి మార్చారు. నిరంతరం నడుస్తున్న ఒక అసలైన వ్యాపార సంస్థ జీఎస్టీ ఖాతానే టార్గెట్ చేసి, దాని ఆధారాలను మార్చివేసి దందా నడిపిన తీరు అధికారులను సైతం ఆశ్చర్యపరిచింది.

బాధితుల ఫిర్యాదు మేరకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ మోసం వెనుక అంతర్రాష్ట్ర వ్యవస్థీకృత సైబర్ ముఠా హస్తం ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. నకిలీ బిల్లుల ద్వారా ఎంత మొత్తం ఐటీసీ క్లెయిమ్ చేశారు? ప్రభుత్వ ఖజానాకు అసలు ఎంత నష్టం వాటిల్లింది? అనే కోణంలో అధికారులు సాంకేతిక ఆధారాల సహాయంతో విచారణ జరుపుతున్నారు.