తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్: ఈనెల 30న రైతు భరోసా నిధులు విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
El Niño Threat Looms Over India’s Farm Sector Ahead of 2026
తెలంగాణలోని అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘రైతు భరోసా’ నిధులను ఈనెల 30వ తేదీన విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో భారీ ఎత్తున నిర్వహించబోయే బహిరంగ సభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ నిధులను విడుదల చేయనున్నారు. ప్రస్తుత వానా కాలం (ఖరీఫ్) సాగుకు సంబంధించిన ఈ పెట్టుబడి సాయం నిధులను, సభ జరిగిన నాటి నుండి కేవలం 10 రోజుల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో పూర్తిగా జమ చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రులతో ఒక ప్రత్యేక ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు. రైతు భరోసా నిధుల విడుదలతో పాటు హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు విస్తరణ పనులు, రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ, వీబీజీ రాంజీ పథకం అమలు తీరు, అలాగే రాష్ట్ర నిధులు, ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరి వంటి పలు ప్రాధాన్యత కలిగిన అంశాలపై ముఖ్యమంత్రి మంత్రులతో కూలంకషంగా చర్చించి దిశానిర్దేశం చేశారు. వానా కాలం సాగు పనులు ఊపందుకుంటున్న తరుణంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ రైతు లోకానికి పెద్ద ఉపశమనం కలిగించనుంది.