Skip to content
జాతీయం వార్తలు

SC on Protest: కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకారులపై ఎఫ్ఐఆర్‌లు రద్దు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

jagan 01 Sep 2026 1 నిమిషాల పఠనం జాతీయం
SC on Protest: కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకారులపై ఎఫ్ఐఆర్‌లు రద్దు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

Supreme Court

SC on Protest: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనకారులకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో భారీ ఉపశమనం లభించింది. జూలై 20 నుంచి 25 మధ్య జరిగిన నిరసనలకు సంబంధించి నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది.

ఈ నిరసనల సమయంలో నమోదైన కేసుల ఉపసంహరణపై రెండు పక్షాల మధ్య అవగాహన కుదరడంతో, రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ద్వారా సంక్రమించిన ప్రత్యేక అధికారాలను ఉపయోగించి ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. అంతేకాకుండా, జూలై 20 నుంచి 25 మధ్య జరిగిన నిరసనల ఆధారంగా సీజేపీ కార్యకర్తలు లేదా విద్యార్థులపై దేశంలో ఎక్కడా కొత్తగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయకూడదని పోలీసులను ఆదేశించింది. అయితే, గతంలోనే తీవ్రమైన నేరచరిత్ర ఉన్న 2,873 మందిపై చట్టపరంగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసుకునేందుకు పోలీసులకు న్యాయస్థానం పూర్తి స్వేచ్ఛనిచ్చింది.

ఆందోళనల సమయంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక నష్టపరిహారం అందించేందుకు గానూ సమగ్ర విధివిధానాలను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. నిబంధనలు ఖరారైన మూడు నెలల్లోగా ఈ పరిహారాన్ని పూర్తిగా చెల్లించాలని స్పష్టం చేసింది.ఇరుపక్షాలు కుదుర్చుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉండాలనే షరతుతో కేసులను రద్దు చేస్తున్నామని, ఇదే విధానాన్ని, షరతులను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు సైతం అనుసరించవచ్చని కోర్టు పేర్కొంది. ఢిల్లీ, బిహార్, అస్సాం, పశ్చిమ బెంగాల్ మరియు మహారాష్ట్ర పోలీసులు కేసుల రద్దుకు అప్లికేషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో.. ఇరువర్గాలు పరస్పర నమ్మకంతో సమస్యను పరిష్కరించుకోవడం శుభపరిణామమని సీజేఐ వ్యాఖ్యానించారు. విద్యార్థులను ఎప్పటికీ ప్రత్యర్థులుగా భావించడం లేదని ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ కోర్టుకు విన్నవించారు.

కేసుల రద్దు, సుప్రీంకోర్టు సానుకూల ఆదేశాల నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ తమ నిరసన కార్యక్రమాలను ఉపసంహరించుకుంది. గతంలో తలపెట్టిన ‘సెప్టెంబర్ 5 ర్యాలీ’ని రద్దు చేస్తున్నట్లు సీజేపీ అధికార ప్రతినిధి (కో-కన్వీనర్) సౌరవ్ దాస్ సుప్రీంకోర్టు ధర్మాసనానికి స్వయంగా వెల్లడించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, సుప్రీంకోర్టు కల్పించిన న్యాయపరమైన రక్షణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.