Skip to content
జాతీయం వార్తలు

GDP Debate Intensifies: జీడీపీ 7.8 శాతం వృద్ధి గణాంకాల గారడీయే: మోదీ ప్రభుత్వంపై జైరాం రమేశ్ తీవ్ర విమర్శలు

jagan 01 Sep 2026 1 నిమిషాల పఠనం జాతీయం
GDP Debate Intensifies: జీడీపీ 7.8 శాతం వృద్ధి గణాంకాల గారడీయే: మోదీ ప్రభుత్వంపై జైరాం రమేశ్ తీవ్ర విమర్శలు

చరిత్ర పునరావృతం కాకూడదు

GDP Debate Intensifies: దేశ జీడీపీ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 7.8 శాతంగా నమోదు కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేయగా.. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ జైరాం రమేశ్ తీవ్రంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం కేవలం ప్రచారార్భాటం కోసం గణాంకాల గారడీతో ప్రజలను భ్రమల్లో ముంచుతోందని.. దేశంలో నిజమైన పరిస్థితులను దాచిపెడుతోందని విమర్శించారు. ప్రస్తుత జీడీపీ గణాంకాలు దేశంలో మందగించిన పెట్టుబడులు, బలహీనపడిన వినియోగం వంటి వాస్తవ పరిస్థితులను ఏమాత్రం ప్రతిఫలించడం లేదని ఆయన దుయ్యబట్టారు.

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సామాన్యులపై ‘హై వోల్టేజ్’ ధరల భారాన్ని మోపుతోందని జైరాం రమేశ్ ఆరోపించారు. ముడిసరకుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్య ప్రజల సొంతింటి కల నెరవేరడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరల భారం కేవలం వంటింటికే పరిమితం కాలేదని, అన్ని రకాల నిర్మాణ సామాగ్రి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని పేర్కొన్నారు.

ఉదాహరణకు రాగి వైర్ ధర కిలో రూ. 850 నుంచి రూ. 1,700 కి, అల్యూమినియం ధర రూ. 350 నుంచి రూ. 650 కి చేరిందని వివరించారు. దీనివల్ల 1,000 చదరపు అడుగుల ఇంటికి వైరింగ్ ఖర్చు ఏకంగా రూ. 50 వేల నుంచి లక్ష రూపాయిలకు పెరిగిందని వెల్లడించారు. వీటితో పాటు హోమ్ అప్లయన్సెస్, ఎల్‌ఈడీ లైట్లు, ఫ్యాన్లు, సోలార్ ప్యానెళ్ల ధరలు 10 నుంచి 20 శాతం వరకు పెరిగాయని, స్విచ్ సాకెట్లు, మెయిన్ లైన్ కేబుల్స్, టైల్స్ నుండి కార్మికుల కూలీల వరకు అన్ని ఖర్చులు పెరిగిపోవడంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.

మరోవైపు, 7.8 శాతం జీడీపీ వృద్ధి నమోదు కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచ సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ ప్రగతిబాటలో దూసుకుపోతోందని, ఇది భారతీయుల సమష్టి శక్తికి నిదర్శనమని అభివర్ణించారు. నిరాశావాదులు అసత్యాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించిన ప్రధాని, ఈ వృద్ధి వేగాన్ని ఇలాగే కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ దేశీయ ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు.