Skip to content
వినోదం వార్తలు

Prakash Raj: బెంగళూరులో ఓటు గల్లంతుపై ప్రకాశ్ రాజ్ ఫైర్.. సెల్ఫీ వీడియోలో ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు

Prajapaksham 11 Aug 2026 1 నిమిషాల పఠనం వినోదం
Prakash Raj: బెంగళూరులో ఓటు గల్లంతుపై ప్రకాశ్ రాజ్ ఫైర్.. సెల్ఫీ వీడియోలో ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు

Prakash Raj

Prakash Raj: బెంగళూరులో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియ తర్వాత గల్లంతైన 65 లక్షల ఓట్లలో తన ఓటు కూడా ఉందని ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక సెల్ఫీ వీడియోను పంచుకుంటూ ఎన్నికల ప్రక్రియ తీరుపై తీవ్ర స్థాయిలో వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.

వీడియోలో ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. “సర్‌ (SIR) సర్వే తర్వాత బెంగళూరు నియోజకవర్గంలో తొలగించిన 65 లక్షల ఓట్లలో నాది కూడా ఉంది. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. నేను ఈ నియోజకవర్గంలోనే పుట్టాను, ఇక్కడే నివసిస్తున్నాను. నా చదువు, నటన నేర్చుకోవడం అన్నీ ఇక్కడే పూర్తయ్యాయి. అన్నింటికంటే ముఖ్యంగా.. నేను ఈ నియోజకవర్గం నుంచే ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేశాను. అయినా సరే నా ఓటును తొలగించారని విచారం వ్యక్తం చేశారు.

మళ్లీ కొత్త ఓటర్ కార్డు పొందడానికి అధికారులు ఎలాంటి డాక్యుమెంట్లు అడుగుతారో అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన ఆయన.. తాను ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. “మీకు ఓటు వేయని వారిని జాబితా నుంచి తొలగించే అధికారం మీకు ఉండొచ్చు. కానీ మిమ్మల్ని అధికారం నుంచి దింపకుండా మమ్మల్ని ఆపగలరా?” అని ప్రకాశ్ రాజ్ ‘గేమ్‌ ఆన్‌’ అంటూ సవాల్ విసిరారు.

బహుళ ఓటర్ కార్డుల వివాదం – బెయిల్ పొందిన నటుడు

మరోవైపు, ప్రకాశ్ రాజ్‌కు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణతో సహా నాలుగు వేర్వేరు రాష్ట్రాల్లో ఓటరు కార్డులు ఉన్నాయనే ఆరోపణలపై ఇటీవల బెంగళూరులో కేసు నమోదైన సంగతి తెలిసిందే. గతంలో అధికారుల నోటీసులకు స్పందించకపోవడంతో ఆయనపై నాన్-బెయిలబుల్ వారెంట్ కూడా జారీ అయింది. ఈ కేసులో జులై నెలలో బెంగళూరు కోర్టు ముందు హాజరైన ప్రకాశ్ రాజ్‌కు, వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.