Skip to content
లైఫ్ స్టైల్ వార్తలు

Sleep Crisis in India: నిద్రలేమితో అల్లాడుతున్న భారతీయులు.. ఏడాదికి దాదాపు 4 రోజుల నిద్ర మిస్.. స్టడీ చెప్పిన ఆసక్తికర విషయాలు..

Prajapaksham 16 Jul 2026 1 నిమిషాల పఠనం లైఫ్ స్టైల్
Sleep Crisis in India: నిద్రలేమితో అల్లాడుతున్న భారతీయులు.. ఏడాదికి దాదాపు 4 రోజుల నిద్ర మిస్.. స్టడీ చెప్పిన ఆసక్తికర విషయాలు..

Sleep Crisis in India: నిద్రలేమితో అల్లాడుతున్న భారతీయులు.. ఏడాదికి దాదాపు 4 రోజుల నిద్ర మిస్.. స్టడీ చెప్పిన ఆసక్తికర విషయాలు..

Sleep Crisis in India: భారతీయులు నిద్ర లేమితో అల్లాడిపోతున్నారు. తాజా అధ్యయనాలు ఇవే చెబుతున్నాయి. దీనికి ప్రధాన కారణం వాతావరణ మార్పులే..దాంతో పాటుగా మానసిక ఒత్తిడి కూడా నిద్రలేమికి కారణమవుతోంది. వేగంగా సంభవిస్తున్న వాతావరణ మార్పులు, పెరుగుతున్న భూతాపం ప్రభావం ఇప్పుడు మనిషికి అత్యవసరమైన నిద్రపై తీవ్రంగా పడుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల మొదటగా దెబ్బతినే వాటిలో నిద్ర ఒకటి కాగా.. వడదెబ్బ లేదా నిర్జలీకరణం (డీహైడ్రేషన్) లాగా ఈ నష్టం త్వరగా కంటికి కనిపించకపోవడం గమనార్హం.

ప్రపంచ వాతావరణ పరిశోధన సంస్థ అయిన క్లైమేట్ సెంట్రల్ నిర్వహించిన ఒక తాజా విశ్లేషణ ప్రకారం.. భారతదేశంలోని ప్రధాన నగరాల్లో నివసించే ప్రజలు అధిక రాత్రి ఉష్ణోగ్రతల కారణంగా ప్రతి సంవత్సరం 65 నుండి 93 గంటల నిద్రను కోల్పోతున్నారని తేలింది. వాతావరణ మార్పులు ప్రజారోగ్యానికి ఎంతటి ముప్పుగా మారుతున్నాయో చెప్పడానికి ఈ అధ్యయనం ఒక ముఖ్యమైన హెచ్చరికగా నిలుస్తోందని ఫరీదాబాద్‌లోని అమృత హాస్పిటల్‌కు చెందిన స్లీప్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ ప్రదీప్ బజాజ్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ అధ్యయనం ప్రకారం వెచ్చని రాత్రుల కారణంగా అనేక భారతీయ నగరాలు గణనీయమైన నిద్రలేమిని ఎదుర్కొంటున్నాయి. మెట్రో నగరాలలో తమిళనాడు రాజధాని చెన్నైలో అత్యధికంగా సంవత్సరానికి సుమారు 93 గంటల నిద్రలేమి నమోదవుతుండగా.. దాని తర్వాతి స్థానాల్లో ముంబై, కోల్‌కతా నగరాలు ఉన్నాయి. సిలికాన్ వ్యాలీ బెంగళూరుతో సహా పలు నగరాలు వాతావరణ మార్పుల బలమైన సంకేతాలను చూపిస్తున్నాయి.

శరీర అంతర్గత ఉష్ణోగ్రత తగ్గడం ప్రారంభమైనప్పుడు మాత్రమే మెదడుకు గాఢ నిద్రకు సంబంధించిన సహజ జీవసంబంధ సంకేతాలు అందుతాయని.. అయితే రాత్రంతా వేడిగా, తేమగా ఉండే పడకగదులు ఆ ప్రక్రియకు అంతరాయం కలిగిస్తున్నాయని వైద్యులు వివరిస్తున్నారు. దీనివల్ల ప్రజలు నిద్రపోవడానికి ఇబ్బంది పడటమే కాకుండా.. జ్ఞాపకశక్తి, రోగనిరోధక శక్తి పెరగడానికి కీలకమైన నిద్ర దశల్లో తక్కువ సమయం గడుపుతున్నారు.

ప్రస్తుతం స్లీప్ క్లినిక్‌లకు వచ్చే రోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతోందని.. ఏడు లేదా ఎనిమిది గంటల పాటు మంచం మీద గడిపినప్పటికీ పగటిపూట అలసట, ఏకాగ్రత లోపం, చిరాకు, ఉదయం తలనొప్పుల గురించి వారు ఫిర్యాదు చేస్తున్నారని డాక్టర్ బజాజ్ పేర్కొన్నారు. ఇక్కడ సమస్య నిద్ర సమయం కాదు.. పరిసరాలలోని వేడి.. నిద్ర నాణ్యతను పాడు చేయడమే. ఈ ప్రభావం వృద్ధులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు, ఊబకాయం ఉన్నవారితో పాటు స్లీప్ అప్నియా, అధిక రక్తపోటు, మధుమేహం లేదా గుండె జబ్బులు ఉన్నవారిలో మరింత తీవ్రంగా ఉంటోంది. పదేపదే నిద్రకు అంతరాయం కలగడం వల్ల రక్తపోటు నియంత్రణ క్షీణించడం.. గ్లూకోజ్ జీవక్రియ దెబ్బతినడం, ఒత్తిడి హార్మోన్లు పెరగడం, కార్యాలయాల్లో ఉత్పాదకత తగ్గడం వంటి తీవ్ర ఆరోగ్య పరిణామాలు సంభవిస్తాయని వైద్యులు చెబుతున్నారు.

ఈ సమస్య నుండి బయటపడటానికి ఎయిర్ కండిషనింగ్ (AC) ఒక్కటే ఏకైక పరిష్కారం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వేడి రాత్రులలో పడకగదిలో గాలి బాగా వచ్చేలా చూసుకోవడం, గాలి ప్రసరించే కాటన్ పరుపు సామాగ్రిని వాడటం, పడుకునే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వంటి చర్యలు తీసుకోవాలి. అలాగే రాత్రి పొద్దుపోయాక భారీ భోజనం, కెఫిన్, మద్యం సేవించకుండా ఉండటంతో పాటు.. పగటిపూట తగినంత నీరు త్రాగడం, క్రమబద్ధమైన నిద్రవేళలను పాటించడం ద్వారా శరీరం యొక్క సహజ శీతలీకరణ ప్రక్రియకు మద్దతు లభిస్తుంది. భారత నగరాల్లో రాత్రులు వేడెక్కుతున్నందున.. నిద్ర అనేది విలాసం కాదు.. అది ఒక జీవసంబంధ అవసరమనే విషయాన్ని ప్రజారోగ్య చర్చలలో ఒక ముఖ్యమైన అంశంగా చేర్చాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది.