Rain Alert in AP: వాయువ్య బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. ఏపీలో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు.. కొన్ని జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక..
Rain Alert in AP: వాయువ్య బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. ఏపీలో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు.. కొన్ని జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక..
Rain Alert in AP: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడటంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం వేగంగా మారుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే, ఒకవైపు వర్ష సూచన ఉన్నప్పటికీ.. దక్షిణ కోస్తా జిల్లాల్లో మాత్రం పగటిపూట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి, వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనితో పాటు సముద్ర తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు కూడా వీస్తున్నాయి.
మరోవైపు జులై మాసంలోనూ తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న తెలంగాణ ప్రజలకు ఈ అల్పపీడనం చల్లటి కబురు మోసుకొచ్చింది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై, ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో సాయంత్రం నుండి రాత్రి వేళల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఉదయం నుండి మధ్యాహ్నం లోపు కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడే అవకాశాలు ఉన్నాయి.
రాజధాని హైదరాబాద్లో కూడా ఉదయం సాధారణ పొడి వాతావరణం ఉన్నప్పటికీ, సాయంత్రం లేదా రాత్రి వేళల్లో ఆకాశం మేఘావృతమై కొన్ని చోట్ల తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ అల్పపీడన వర్షాలు ఉక్కపోత నుండి ప్రజలకు ఉపశమనం కలిగించడంతో పాటు, సాగు పనుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఎంతో మేలు చేయనున్నాయి.