16 పత్రాలిచ్చినా భారత పౌరుడిగా నిరూపించుకోలేకపోయిన పిటిషనర్.. గౌహతి కోర్టు సంచలన తీర్పు..
పౌరసత్వ నిరూపణపై గౌహతి హైకోర్టు సంచలన తీర్పు
భారతీయ పౌరసత్వ నిరూపణ పత్రాలకు సంబంధించిన తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో గౌహతి హైకోర్టు ఒక సంచలన తీర్పును వెలువరించింది. ఒక రిట్ పిటిషన్పై విచారణ జరుపుతూ, పిటిషనర్ తన పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి 16 రకాల అధికారిక పత్రాలను సమర్పించినప్పటికీ.. తాను భారత పౌరుడినని చట్టబద్ధంగా నిరూపించడంలో విఫలమయ్యారని న్యాయస్థానం స్పష్టం చేసింది. జస్టిస్ కల్యాణ్ రాయ్ సురానా, జస్టిస్ షమీమా జహాన్ లతో కూడిన ధర్మాసనం జూన్ 30న ఈ కీలక ఉత్తర్వులను జారీ చేసింది.
ఫారినర్స్ యాక్ట్ (1964) లోని సెక్షన్ 9 ను ప్రస్తావిస్తూ.. పిటిషనర్ సమర్పించిన 16 పత్రాలు అతను విదేశీయుడు కాదని, భారతీయ పౌరుడేనని నిరూపించడానికి ఎంతమాత్రం సరిపోవడం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. దేశంలో ఒక వ్యక్తి విదేశీయుడా కాదా అనే ప్రశ్న తలెత్తినప్పుడు.. తాను భారతీయ పౌరుడినని నిరూపించుకోవాల్సిన ప్రాథమిక బాధ్యత పూర్తిగా ఆ వ్యక్తిపైనే ఉంటుందని న్యాయస్థానం క్లియర్ కట్గా తేల్చి చెప్పింది.
గౌహతికి చెందిన అమీనుల్ హక్ అనే వ్యక్తి.. తనను విదేశీయుడిగా ప్రకటిస్తూ ఫారినర్స్ ట్రిబ్యునల్ 2019 ఫిబ్రవరి 28న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తన కుటుంబం తరతరాలుగా అసోంలోనే నివసిస్తోందని.. తాను భారతీయుడినేనని ఆయన కోర్టులో గట్టిగా వాదించారు. తన వాదనకు మద్దతుగా ఆయన 1951 నాటి జాతీయ పౌర పట్టిక (NRC) ప్రతులు (ఇందులో అతని తాత, తండ్రి పేర్లు ఉన్నాయి), 1966 నుండి 2017 వరకు తన తల్లిదండ్రుల, తన పేరు ఉన్న ఓటర్ల జాబితాల ధృవీకృత ప్రతులు, 1973 నాటి భూమి కొనుగోలు పత్రాలు, పాన్ కార్డ్ (PAN), ఓటరు గుర్తింపు కార్డులు (Voter IDs), స్కూల్ సర్టిఫికేట్ను న్యాయస్థానానికి సమర్పించారు.
ఈ విచారణలో పిటిషనర్ తండ్రి స్వయంగా కోర్టుకు హాజరై అమీనుల్ హక్ తన కుమారుడేనని గుర్తించినప్పటికీ కోర్టు దానిని తిరస్కరించింది. సరైన రాతపూర్వక లేదా డాక్యుమెంటరీ లింక్ ఆధారాలు లేకుండా కేవలం నోటి మాటల ద్వారా చెప్పే సాక్ష్యం ఇద్దరి మధ్య రక్తసంబంధాన్ని, తద్వారా పౌరసత్వాన్ని నిరూపించడానికి సరిపోదని కోర్టు పేర్కొంది. అలాగే, హష్దోబా ఆంచలిక్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు 2017లో ఇచ్చిన స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ను (అతను 1999లో పాఠశాల వదిలి వెళ్ళినట్లు ఉన్న పత్రం) పిటిషనర్ సమర్పించినప్పటికీ, ఆ సర్టిఫికేట్ జారీ చేసిన హెడ్మాస్టర్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పనందున దానికి చట్టపరంగా ఎలాంటి విలువ లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది.
పిటిషనర్ తండ్రి పేరు వేర్వేరు పత్రాల్లో మొహీరుద్దీన్ షేక్, మహ్రుద్దీన్ షేక్, మొహీరుద్దీన్ అని వేర్వేరు స్పెల్లింగులతో ఉన్నప్పటికీ, కోర్టు ఈ తప్పులను పెద్దగా పరిగణించలేదు. కానీ, పిటిషనర్ కుటుంబం దోబాకురా, ఘుగుదోబా, హష్దోబా అనే మూడు గ్రామాల్లో నిరంతరంగా కలిసి నివసించినట్లు ఓటర్ల జాబితా ద్వారా నిరూపించడంలో విఫలమయ్యారని కోర్టు ఎత్తిచూపింది. ఈ మూడు గ్రామాల ఓటర్ల జాబితాలన్నింటిలో పిటిషనర్తో పాటు కుటుంబంలోని సభ్యులుగా చూపబడిన పత్రాల్లోని ఖాళీలను పూరించడానికే ఓటర్ల జాబితాలను వాడుకున్నారని, కానీ కుటుంబం ఒక గ్రామం నుండి మరో గ్రామానికి చట్టబద్ధంగా మారినట్లు ఎలాంటి నిలకడైన ఆధారాలు లేవని స్పష్టం చేస్తూ హైకోర్టు పిటిషన్ను తిరస్కరించింది.