కేరళలో భారీ వర్షాల బీభత్సం.. ఒకరు మృతి, ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్
Kerala Rain Havoc: One Killed, Homes Damaged as IMD Sounds Red Alert
నైరుతి రుతుపవనాలతో పాటు సైక్లోన్ ప్రభావం తోడవడంతో కేరళ రాష్ట్రంలో భారీ వర్షాలు తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా అనేక జిల్లాల్లో ఇండ్లు, ఆస్తులు ధ్వంసం కాగా, ప్రధాన రహదారులు నీట మునిగాయి. ఈ వర్షాల తీవ్రతకు త్రిశూర్ జిల్లాలోని మనలూర్ వద్ద ఒక తాత్కాలిక షెడ్పై చెట్టు విరిగిపడటంతో, అందులో నిద్రిస్తున్న ఒక యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనేక ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తడంతో సాధారణ జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.
రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ అత్యంత అప్రమత్తత ప్రకటించింది. ఉత్తర కేరళ తీర ప్రాంతంలో సైక్లోన్ ప్రభావం బలంగా ఉందని, ఈ నెల చివరి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రస్తుత వర్ష తీవ్రతను బట్టి మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూర్, కాసర్గోడ్ జిల్లాలకు ఐఎండీ అత్యంత ప్రమాదకరమైన ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. ఈ జిల్లాల్లో రాబోయే 24 గంటల్లో ఏకంగా 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉంది. అలాగే పతనాంథిట్ట, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి, త్రిశూర్, పాలక్కాడ్ జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో 11 నుంచి 20 సెంటీమీటర్ల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
ఈ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో కేరళలోని పర్యాటక ప్రాంతాల్లో అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. ముఖ్యంగా వయనాడ్, కోజికోడ్, కాసర్గోడ్ పరిధిలోని కొండ ప్రాంతాలలో ట్రెకింగ్ను పూర్తిగా నిషేధించారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న దృష్ట్యా పర్యాటకులు తక్షణమే కొండ ప్రాంతాలను వీడి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, రాత్రి వేళల్లో ప్రయాణాలను పూర్తిగా మానుకోవాలని అధికారులు హెచ్చరించారు.
ప్రస్తుతం వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. కాగా, దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడం వల్లే కేరళతో పాటు గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని ఐఎండీ స్పష్టం చేసింది. తీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.