హైడ్రాపై దేశమంతా ఆసక్తిగా చూస్తోంది..ఇతర రాష్ట్రాలు అధ్యయనం చేస్తున్నాయి: సీఎం సీఎం రేవంత్ రెడ్డి
Telangana CM Revanth Reddy Gets Relief in Huzurabad Bypoll Case
తెలంగాణలో జలవనరుల ఆక్రమణలను నిర్మూలించడానికి , యువతను పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని అంతం చేయడానికి తమ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా (HYDRAA), ఈగల్ ఫోర్స్ (EAGLE Force) వ్యవస్థలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో జరిగిన ఒక సదస్సులో పాల్గొన్న ఆయన, ఈ రెండు ప్రతిష్టాత్మక విభాగాలు పనిచేస్తున్న తీరును, వాటి వెనుక ఉన్న ఉద్దేశాలను సుదీర్ఘంగా వివరించారు. ఈ సందర్భంగా ఉపాధి రంగంలో వస్తున్న మార్పులపై కూడా యువతకు దిశా నిర్దేశం చేశారు.
రాష్ట్రంలో జలవనరుల కబ్జాను అడ్డుకునేందుకే పటిష్టమైన చట్టబద్ధ అధికారాలతో హైడ్రాను ఏర్పాటు చేశామని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. నేడు తెలంగాణలో ఎవరైనా సరే, చెరువులు లేదా కుంటల జోలికి వెళ్లాలంటేనే భయపడేలా ఈ వ్యవస్థను తీర్చిదిద్దామన్నారు.
“పేదలు నిలువ నీడ లేక చెరువులను ఆక్రమిస్తే మానవీయ కోణంలో అర్థం చేసుకోవచ్చు. కానీ, ధనికులు తమ విలాస భవనాలు, ఫామ్ హౌస్ల కోసం చెరువులను, నాలాలను నిస్సిగ్గుగా ఆక్రమిస్తున్నారు. అంతటితో ఆగకుండా, తమ భవనాల వ్యర్థాలను సైతం ఆ చెరువుల్లోనే కలిపి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు.” అని సీఎం మండిపడ్డారు.
ఇలాంటి బడా కబ్జాలను అరికట్టేందుకే ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి నేతృత్వంలో, దాదాపు 3 వేల మంది సిబ్బందితో హైడ్రాను రంగంలోకి దించామన్నారు. ప్రస్తుతం ఎవరు ఆక్రమణలకు పాల్పడినా వెనకాడకుండా ఆ కట్టడాలను నేలమట్టం చేస్తున్నామని, అందుకే ఇవాళ దేశమంతా హైడ్రా వైపు ఆసక్తిగా చూస్తోందని పేర్కొన్నారు.
యువత భవిష్యత్తును అంధకారం చేస్తున్న మాదకద్రవ్యాల (డ్రగ్స్) సరఫరాను సమూలంగా నివారించడానికి ఏర్పాటు చేసిన ‘ఈగల్ ఫోర్స్’ (Elite Action Group for Drug Law Enforcement) దేశంలోనే అత్యంత ఉత్తమమైన నిఘా వ్యవస్థగా నిలిచిందని సీఎం కొనియాడారు. డ్రగ్స్ నెట్వర్క్లను పసిగట్టి, వాటిని పూర్తిగా నిర్మూలించడంలో ఈ ఫోర్స్ అద్భుతంగా పనిచేస్తోందని తెలిపారు. హైడ్రా , ఈగల్ ఫోర్స్ లాంటి వినూత్న వ్యవస్థల ద్వారా తెలంగాణ దేశానికే రోల్ మోడల్గా నిలుస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మారుతున్న సాంకేతిక యుగంలో ఉపాధి అవకాశాలపై యువత తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత విస్తరిస్తుండటంతో భవిష్యత్తులో వైట్ కాలర్ (ఐటీ, సాఫ్ట్వేర్ తదితర డెస్క్ ఉద్యోగాలు) ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని వస్తున్న ఆందోళనలపై ఆయన స్పందించారు.
వైట్ కాలర్ ఉద్యోగాలకు ప్రత్యామ్నాయంగా బ్లూ కాలర్’ (నైపుణ్య ఆధారిత , క్షేత్రస్థాయి పరిశ్రమల) ఉద్యోగాలు భారీగా అందుబాటులోకి రానున్నాయని రేవంత్రెడ్డి విశ్లేషించారు. యువతరం సాంప్రదాయ కోర్సులకే పరిమితం కాకుండా, మారుతున్న మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ రంగాలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా స్కిల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేసిందని, యువత వివిధ రంగాలలో తమ ప్రాక్టికల్ స్కిల్స్ పెంచుకుంటే అపారమైన అవకాశాలను సులువుగా అందుపుచ్చుకోవచ్చని సీఎం రేవంత్రెడ్డి ఈ సదస్సు ద్వారా ఆత్మవిశ్వాసం నింపారు.