భారత కరెన్సీలో మార్పులపై సంజయ్ మల్హోత్రా కీలక ప్రకటన.. త్వరలో ప్లాస్టిక్ నోట్లు వస్తాయా..
RBI Governor Sanjay Malhotra Clarifies Stand on Plastic Currency Notes
భారతదేశంలో పాలిమర్ (ప్లాస్టిక్) కరెన్సీ నోట్లు రాబోతున్నాయంటూ సోషల్ మీడియాలో, కొన్ని వార్తా మాధ్యమాల్లో వస్తున్న ప్రచారంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలకమైన స్పష్టతనిచ్చారు. ప్రస్తుతం ప్లాస్టిక్ నోట్ల ప్రవేశపెట్టే ప్రతిపాదనను పరిశీలిస్తున్న మాట నిజమే అయినప్పటికీ, అది ఇంకా పూర్తిగా ప్రాథమిక దశలోనే ఉందని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం దేశంలో కాగితపు (పేపర్) కరెన్సీ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అయితే, ఈ కాగితపు నోట్ల ముద్రణకు భారీగా ప్రభుత్వ సొమ్ము ఖర్చవుతుండటం, అలాగే అవి త్వరగా చిరిగిపోవడం లేదా పాడైపోవడం వల్ల చలామణి నుండి తరచూ తొలగించాల్సి రావడం పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలోనే, ఎక్కువ కాలం మన్నికగా ఉండే ప్లాస్టిక్ నోట్లను తీసుకురావడానికి గల సాధ్యాసాధ్యాలపై ఆర్బీఐ కసరత్తు చేస్తోంది. ఈ నోట్ల వల్ల చేకూరే ప్రయోజనాలతో పాటు, భవిష్యత్తులో దేశీయంగా ఎదురయ్యే సాంకేతిక, నిర్వహణ (ఆపరేషనల్) సమస్యలపై ఆర్బీఐ నిపుణుల బృందం ప్రస్తుతం లోతుగా అధ్యయనం చేస్తోంది.
నిజానికి, భారతదేశంలో ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టాలనే ఆలోచన ఈనాటిది కాదు. దశాబ్దం క్రితం, అంటే 2014 ఫిబ్రవరిలోనే కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన సమాచారాన్ని పార్లమెంటుకు సమర్పించింది. మన దేశంలోని విభిన్న భౌగోళిక, వాతావరణ పరిస్థితుల్లో ప్లాస్టిక్ నోట్లు ఎంతవరకు తట్టుకుంటాయో పరీక్షించడానికి అప్పట్లో దేశవ్యాప్తంగా ఐదు నగరాలను (కొచ్చి, మైసూర్, జైపూర్, సిమ్లా, భువనేశ్వర్) ఎంపిక చేశారు. ఆయా నగరాల్లో ప్రయోగాత్మకంగా (పైలట్ ప్రాజెక్ట్ కింద) రూ. 100 కోట్ల విలువైన ప్లాస్టిక్ నోట్లను చలామణిలోకి తీసుకురావాలని భావించారు. అయితే, కొన్ని సాంకేతిక లోపాలు, నిర్వహణ సమస్యల కారణంగా అప్పట్లో ఆ ప్రాజెక్టు తాత్కాలికంగా ము ముందుకు సాగలేదు. ఇప్పుడు ఆర్బీఐ మళ్లీ ఆ ప్రతిపాదనలను పరిశీలిస్తుండటంతో, త్వరలోనే దేశంలో ప్లాస్టిక్ నోట్లు అందుబాటులోకి వస్తాయనే ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి.