అన్నగా వస్తే హైదరాబాదీ బిర్యానీ పెడతాం..పెత్తనం చేయాలని వస్తే ఒప్పుకోం.. పవన్పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
KTR to Pawan Kalyan: ‘Come as a Brother, We’ll Serve Biryani; Don’t Try to Rule Us
భారత్ రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. తెలంగాణ గడ్డ కచ్చితంగా ఇక్కడి భూమి పుత్రుల, ఇక్కడున్న నాలుగు కోట్ల మంది జాగీరేనని, ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ నేల కోసం కష్టపడి, పోరాటాలు చేసి, త్యాగాలు చేసిన వారి నెత్తురుతో తడిసిన గడ్డ ఇదని గుర్తుచేశారు. పవన్ కళ్యాణ్ కుటుంబం, వ్యాపారాలు ఇక్కడే ఉన్నాయని, వారిని ఇక్కడే ఉండమంటున్నామే తప్ప ఎవరూ వద్దనడం లేదని, గత పదేళ్లలో ఇక్కడ ఎవరికైనా చిన్న సమస్య అయినా వచ్చిందా అని ప్రశ్నించారు. ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉండాలనే తాము కోరుకున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.
ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదమన్న పవన్ వ్యాఖ్యలను తప్పుబడుతూ.. నాడు మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం వేర్పడాలని పొట్టి శ్రీరాములు గారు 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేయడాన్ని కూడా ప్రాంతీయవాదం అంటారా అని నిలదీశారు. అలాగే జాతీయవాదం ముసుగులో ప్రధానమంత్రి మోదీ గారు తన ప్రాంతంపై అభిమానంతో తెలంగాణకు రావలసిన పరిశ్రమలను గుజరాత్కు పట్టుకుపోతున్నారని, మరి ఈ ఆర్థిక ప్రాంతీయవాదం కరెక్టేనా అని అడిగారు. ప్రధానమంత్రి కేవలం గుజరాత్కే ప్రధానిలా వ్యవహరించడంపై పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక్కడ కొద్దిరోజుల్లో జనగణమన పాడరంటూ చేసిన వ్యాఖ్యలపై మండిపడుతూ, నిజాం సర్కార్కు వ్యతిరేకంగా పోరాడి, కమ్యూనిస్టులు కదంతొక్కిన ఈ నేలకు పోరాటాలు, త్యాగాలు కొత్తకాదని, తమకు దేశభక్తి గురించి పవన్ కళ్యాణ్ దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
పవన్ కళ్యాణ్ను ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా తాము కచ్చితంగా గౌరవిస్తామని, ఒక నటుడిగా అభిమానిస్తామని, సోదరుడిగా ఇంటికి వస్తే హైదరాబాదీ బిర్యానీ పెడతామని, కానీ ఇక్కడి సెక్రటేరియట్లో కూర్చొని పెత్తనం చేస్తామంటే మాత్రం ఒప్పుకోమని తేల్చిచెప్పారు. అరవై ఏళ్లు పోరాడి 2014లో తాము వేరుపడ్డామని, పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమా తరహాలో తమకు ఇక్కడ అసలైన తెలంగాణ ఓజీ కేసీఆర్ ఉన్నారని, ఆయన తమ రాష్ట్రాన్ని కాపాడుకుంటారని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య దేశంలో ఏ నాయకుడైనా, ఏ ప్రాంతంలోనైనా పార్టీ పెట్టి పోటీ చేసే హక్కును బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించారని, అయితే ఏ ప్రాంతంలో పోటీ చేయాలనుకుంటున్నారో మొదట ఆ ప్రాంత ఆకాంక్షలు, ప్రజల మనోభావాలు తెలుసుకోవాలని హితవు పలికారు. జనసేన తెలంగాణలో పోటీ చేయడం కొత్తేమీ కాదని, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో 350 వార్డుల్లో పోటీ చేసినప్పుడు మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారని ప్రశ్నించారు.
తెలంగాణ ఏదో ఆశామాషీగా ఏర్పడిన రాష్ట్రం కాదని, వేల మంది బలిదానాలతో కూడినదని, కాబట్టి ఇక్కడికి వచ్చి మాట్లాడేటప్పుడు ఒకటి గమనించాలన్నారు. జనసేనను ఇక్కడ ఎవరూ అడ్డుకోవడం లేదని, ఏదో ఊహాజనిత ప్రపంచాన్ని సృష్టించుకోవద్దని సూచించారు. తెలంగాణ ఏర్పడిన పద్ధతి నచ్చలేదని కొందరు, విభజన నచ్చలేదని మరికొందరు ఉల్టా పుల్టా మాట్లాడుతున్నారని, తెలంగాణ ఏర్పడడం ఇష్టం లేకనే ఇలా సాకులు వెతుకుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఇక్కడ సభ పెడదామనుకుంటే అడ్డుకున్నది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమని, ఏమన్నా అనాలనుకుంటే వాళ్లనే అనాలని కేటీఆర్ స్పష్టం చేశారు.