గత బీఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్ల పేరిట రూ. వేల కోట్లు దోచుకుంది.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి ప్రెస్మీట్ హైలైట్స్..
CM Revanth Reddy Addresses Press Meet on Palamuru Irrigation Project
గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో కమీషన్ల పేరిట వేల కోట్ల రూపాయలను కొల్లగొట్టిందని, కానీ ఒక్క ఎకరాకు కూడా సాగునీరు ఇవ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా రెండో రోజు ఆయన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం కరివెన రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడారు.
ఉమ్మడి జిల్లాలో జూరాల మినహా మిగిలిన అన్ని సాగునీటి ప్రాజెక్టులూ పెండింగ్లోనే ఉండిపోయాయని సీఎం విమర్శించారు. పంపులు, లిఫ్ట్ పనులలో జరిగిన భారీ అవినీతిపై మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి ఏళ్ల తరబడి పోరాటం చేశారని గుర్తుచేశారు. తాము జిల్లా అంతటా పర్యటిస్తూ ప్రాజెక్టులను ఒక కొలిక్కి తెచ్చేందుకు శ్రమిస్తుంటే, బీఆర్ఎస్ నేతలు మాత్రం దానికి అడ్డుపడుతూ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా పనుల పురోగతిని అంచనా వేసి, భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
గతంలో కష్టకాలంలో పాలమూరు ప్రజలు కేసీఆర్ను ఎంపీగా గెలిపిస్తే జిల్లాను అభివృద్ధి చేస్తారని ఆశించారని, కానీ కృష్ణా జలాలు జిల్లా గుండా ప్రవహిస్తున్నా ఆయన ఎన్నడూ వాటిని ఒడిసి పట్టుకోలేదని రేవంత్రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక కూడా ప్రాజెక్టుల గురించి ప్రశ్నిస్తే అవాస్తవాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయి ఉంటే 26 లక్షల ఎకరాలకు ఆయకట్టు వచ్చేదని, కానీ రూ.27వేల కోట్లు ఖర్చు చేసి కేవలం పంపులు, లిఫ్ట్ పనులు మాత్రమే పూర్తిచేసి కేసీఆర్ తన ఇంట్లో కనకవర్షం కురిపించుకున్నారని ఆరోపించారు. ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ (పునరావాసం) పనులు చేయకుండా రిజర్వాయర్లలో నీళ్లు ఎలా నింపుతారని, అలాంటప్పుడు ప్రాజెక్టులు పూర్తయినట్లు కేసీఆర్ ఎలా భావించారని ప్రశ్నించారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుల కోసం రూ.22వేల కోట్లు ఖర్చు చేయగా, అందులో రూ.8 వేల కోట్లు ఉమ్మడి పాలమూరు జిల్లాకే కేటాయించామని సీఎం తెలిపారు. ఈ జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి కావాలంటే ఇంకా 4వేల ఎకరాల భూసేకరణ జరగాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేయడం వల్ల ప్రస్తుతం ప్రాజెక్టులకు కొత్తగా అప్పులు పుట్టని పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.55వేల కోట్ల అంచనా వ్యయం కాగా, అందులో కేవలం రూ.27వేల కోట్లు (యాభై శాతం లోపు) మాత్రమే ఖర్చు చేసి 90 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఉన్నదంతా దోచుకుని, ఇప్పుడు తమను దోషులుగా నిలబెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. తనపై ఉన్న వ్యక్తిగత కోపంతోనే మక్తల్-నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ గతంలో తొక్కిపెట్టారని రేవంత్రెడ్డి ఆరోపించారు.
జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని, భూసేకరణకు రూపాయి ఎక్కువైనా ఇచ్చి సమస్యలను పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. తక్కువ భూసేకరణతో ఎక్కువ నీటిని నిల్వ చేసుకునే ప్రాజెక్టులకు తాము ప్రాధాన్యత ఇస్తున్నామని, కర్ణాటక ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ బ్రిడ్జ్ కమ్ బ్యారేజీల నిర్మాణాలపై అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. అభివృద్ధి పనులకు అడ్డుపడవద్దని కోరుతూ, బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు పైసా విలువ లేదన్నారు.
కేసీఆర్ ప్రస్తుతం చెల్లామణిలో లేని ‘రద్దయిన వెయ్యి రూపాయల నోటు’ లాంటివారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీకి కేవలం గతమే ఉందని, భవిష్యత్తు లేదని జోస్యం చెప్పారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పేరు మార్చి దోపిడీ చేయడమే కేసీఆర్కు తెలుసని, ఆయన సొంతంగా మొదలుపెట్టి పూర్తి చేసిన ప్రాజెక్టు రాష్ట్రంలో ఒక్కటి కూడా లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిన తర్వాత కూడా, అందులోని చుక్క నీటిని వాడకుండానే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి సాధించి చూపామని రేవంత్రెడ్డి స్పష్టం చేశారు.