అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినా.. భారత్లో ఇప్పుడే ఇంధన ధరలు తగ్గించలేం.. స్పష్టం చేసిన కేంద్ర మంత్రి సురేశ్ గోపీ
Centre Says Immediate Reduction in Fuel Prices Not Possible
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన చారిత్రాత్మక శాంతి ఒప్పందంతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు తొలగిపోయాయి. దీని ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు గణనీయంగా దిగివస్తున్నాయి. అయితే, అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పటికీ.. మన దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించలేమని కేంద్ర ప్రభుత్వం తాజాగా తేల్చి చెప్పింది. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు, పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపీ గురువారం మీడియాతో మాట్లాడుతూ ఇంధన ధరల తగ్గింపుపై స్పష్టత ఇచ్చారు. ఇటీవల పెంచిన ధరలను వెంటనే వెనక్కి తీసుకోలేమని ఆయన వెల్లడించారు.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ, ఆ ప్రయోజనం వెంటనే వినియోగదారులకు అందకపోవడానికి గల కారణాలను మంత్రి సురేశ్ గోపీ వివరించారు. శాంతి ఒప్పందం తర్వాత వ్యూహాత్మక హర్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకున్నప్పటికీ, ప్రస్తుతం అక్కడ నౌకల రాకపోకల రద్దీ విపరీతంగా పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ఆ రద్దీని తట్టుకుని, తక్కువ ధరకు లభించే ముడి చమురు మన దేశానికి చేరుకోవడానికి ఇంకా చాలా సమయం పడుతుందని తెలిపారు. వీటన్నింటికీ తోడు ఇటీవల ఇంధన ధరలను లీటరుకు సగటున రూ.3.94 మాత్రమే పెంచామని, కాబట్టి పరిస్థితులు పూర్తిగా చక్కబడే వరకు వేచి చూడాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు.
పశ్చిమాసియా సంక్షోభం సమయంలో దేశీయ చమురు కంపెనీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయని, ఆ క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వమే ఆర్థిక భారాన్ని మోసిందని మంత్రి గుర్తుచేశారు. యుద్ధం మొదలైన తర్వాత చమురు ధరలు భగ్గుమన్నప్పుడు.. వినియోగదారులపై భారం తగ్గించేందుకు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు రాలేదని ఆయన విమర్శించారు. రాష్ట్రాలు సహకరించకపోవడంతో ఆ భారాన్నంతా కేంద్రమే భరించాల్సి వచ్చిందని, దీనివల్ల కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.12,000 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోయిందని మంత్రి సురేశ్ గోపీ స్పష్టం చేశారు. మొత్తం మీద, అంతర్జాతీయంగా శాంతి వాతావరణం నెలకొన్నా.. చౌక ముడి చమురు భారత్కు చేరుకుని, చమురు కంపెనీల ఆర్థిక పరిస్థితి కుదుటపడే వరకు సామాన్యులకు ఇంధన ధరల నిరీక్షణ తప్పదు.