Azad Hind Party: ఆజాద్ హింద్ పార్టీ.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ముని మనవడు కొత్త పార్టీ పేరు ప్రకటన.. ప్రధాన అజెండా ఇదే..
Chandra Kumar Bose
Azad Hind Party: దేశ స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలు, సిద్ధాంతాలను పునాదిగా చేసుకుని ఆయన మునిమనవడు చంద్రకుమార్ బోస్ (66) కొత్త రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. ‘ఆజాద్ హింద్ పార్టీ’ (Aazad Hind Party) పేరుతో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు ఆగస్టు 11, 2026న ఆయన అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థల్లో పెరుగుతున్న అవినీతి, విద్యా వ్యవస్థలోని లోపాలు, యువతలో వ్యక్తమవుతున్న అసంతృప్తినే ప్రధాన అజెండాగా చేసుకుని, యువతరం నాయకత్వంలో ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు.
నీట్-యూజీ 2026 (NEET-UG 2026) ప్రశ్నపత్రం లీకేజీ వివాదంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా జెన్-జీ’ (Gen-Z) విద్యార్థులు, యువత జూన్ చివరి నుంచి చేపట్టిన ఆందోళనలు ఈ నిర్ణయానికి ప్రధాన ప్రేరణగా నిలిచాయని బోస్ వెల్లడించారు. అవినీతిమయమైన ప్రస్తుత వ్యవస్థలపై యువత తీవ్ర నిరాశతో ఉందన్నారు. విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు ఇలా ప్రతి రంగంలో అవినీతి జీవన విధానంగా మారింది. దేశవ్యాప్తంగా వ్యాపించిన ఈ అవినీతిపై, తమ హక్కుల కోసం పోరాడేందుకు యువతకు ఒక ప్రత్యేకమైన, సమ్మిళిత, లౌకిక రాజకీయ వేదిక అవసరం. నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్, ఆజాద్ హింద్ పార్టీ పతాక నీడలో పోరాడటం కన్నా గొప్పది మరొకటి ఉండదు” అని ఆయన వ్యాఖ్యానించారు.
చంద్రకుమార్ బోస్ గతంలో ప్రధాన రాజకీయ పార్టీలలో కీలక పాత్ర పోషించినప్పటికీ.. ఆ అనుభవాలు నిరాశనే మిగిల్చాయి. 2016లో బీజేపీలో చేరిన ఆయన ఏడేళ్ల పాటు ఆ పార్టీలోనే ఉన్నారు. అయితే, నేతాజీ సిద్ధాంతాలను ప్రచారం చేయడానికి బీజేపీ వాగ్దానం చేసిన ‘ఆజాద్ హింద్ మోర్చా’ను కార్యరూపంలోకి తేకపోవడంతో బీజేపీలో చేరడం ఒక “పొరపాటు” అని భావించి బయటకు వచ్చేశారు.
ఆ తర్వాత 2026 ఏప్రిల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీలో చేరారు. అయితే అక్కడ కూడా నేతాజీ ఐడియాలజీని సమర్థవంతంగా ప్రచారం చేసేందుకు వాతావరణం అనుకూలించకపోవడంతో కేవలం నాలుగు నెలల కాలంలోనే.. అంటే ఆగస్టు 3, 2026న టీఎంసీకి రాజీనామా చేస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి లేఖ పంపారు.
ప్రధాన స్రవంతి రాజకీయాల్లో ఉన్న సంకుచితత్వానికి, నీచ స్థాయి రాజకీయాలకు స్వస్తి పలికి, ప్రగతిశీల, సమ్మిళిత, లౌకిక భావాలు గల పౌరులు, ముఖ్యంగా యువతరం ఈ ‘ఆజాద్ హింద్ పార్టీ’కి అండగా నిలుస్తుందని చంద్రకుమార్ బోస్ ఆశాభావం వ్యక్తం చేశారు.
- Azad Hind Party: ఆజాద్ హింద్ పార్టీ.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ముని మనవడు కొత్త పార్టీ పేరు ప్రకటన.. ప్రధాన అజెండా ఇదే..
- రూ.90 లక్షల ఇంటి అప్పులు.. ఇద్దరు పిల్లల్ని అనాధలుగా చేస్తూ దంపతులు ఆత్మహత్య..
- Hyderabad: ఏసీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య.. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు..
- El Nino- Monsoon: వర్షాలు దంచికొడుతున్నా తప్పని ఎల్నినో భయం..ఖరీప్ సాగుపై నిపుణులు ఆందోళన
- Vivo T5e విడుదల: 5500mAh బ్యాటరీ, AI ఫీచర్లతో బడ్జెట్ ధరకు కొత్త స్మార్ట్ఫోన్