Skip to content
ప్రపంచం వార్తలు

బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత.. 81 అడుగుల రాముడి విగ్రహ నిర్మాణ నిలిపివేతపై హిందువులు నిరసన.. జైశ్రీరామ్ నినాదాలతో దద్దరిల్లిన ఢాకా..

Prajapaksham 20 Jun 2026 0 నిమిషాల పఠనం ప్రపంచం
బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత.. 81 అడుగుల రాముడి విగ్రహ నిర్మాణ నిలిపివేతపై హిందువులు నిరసన.. జైశ్రీరామ్ నినాదాలతో దద్దరిల్లిన ఢాకా..

Massive Hindu Protest in Dhaka After Alleged Desecration Incident Sparks Tensions

బంగ్లాదేశ్‌లో మైనారిటీల హక్కుల అణచివేత, మతపరమైన వేధింపులు మరోసారి అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. గైబంధ జిల్లాలోని పలాష్‌బరి కాంప్లెక్స్ శ్రీశ్రీ రాధా గోవింద దేవస్థాన ప్రాంగణంలో నిర్మిస్తున్న 81 అడుగుల భారీ శ్రీరాముడి విగ్రహ ఏర్పాటును ప్రభుత్వం అకస్మాత్తుగా నిలిపివేయడాన్ని నిరసిస్తూ దేశ రాజధాని ఢాకాలో హిందూ సంఘాలు, విద్యార్థులు శుక్రవారం రాత్రి కదంతొక్కారు.

శ్రీశ్రీ రాధా గోవింద దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో రాముడి విగ్రహంతో పాటు కృష్ణుడు, శివుడి విగ్రహాలను కూడా ప్రతిష్ఠిస్తుండగా, అందులో రాముడి విగ్రహం దేశంలోనే అత్యంత పెద్దదిగా రూపుదిద్దుకుంటోంది. ఈ చారిత్రాత్మక నిర్మాణ పనులు దాదాపు 80 శాతం మేర పూర్తయిన తరుణంలో, అక్కడ మెజారిటీగా ఉన్న కొన్ని ముస్లిం कट्टरవాద సంఘాలు, మత గురువులు ఈ విగ్రహ నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ హెచ్చరికలు జారీ చేశారు. ఒత్తిళ్లకు తలొగ్గిన ప్రభుత్వం విగ్రహ పనులను నిలిపివేయాలని ఆదేశించడంతో పాటు, ఇటీవల కొందరు ముస్లిం నిరసనకారులు శ్రీరాముడి చిత్రపటాన్ని బహిరంగంగా అవమానించడం హిందూ సమాజంలో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది.

తమ ఆరాధ్య దైవానికి జరిగిన అవమానానికి ,విగ్రహ ఏర్పాటుపై విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా వేలాది మంది హిందువులు, యువత ఢాకా వీధుల్లోకి వచ్చి భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఢాకాలోని ప్రముఖ షాబాగ్ ఇంటర్‌సెక్షన్ నుండి నేషనల్ ప్రెస్ క్లబ్ వరకు “జైశ్రీరామ్” నినాదాలతో హోరెత్తిస్తూ కాగడాల (మషాల్) ర్యాలీ నిర్వహించారు. మరికొన్ని హిందూ హక్కుల సంస్థలు ఢాకాలోని రిపోర్టర్స్ యూనిటీ బిల్డింగ్ వద్ద ధర్నాకు దిగి, రాముడి విగ్రహ నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేసి తీరాలని డిమాండ్ చేశాయి.

హిందూ దేవుళ్లను అసభ్యంగా దూషించి, చిత్రపటాలను ధ్వంసం చేసిన నిందితులపై తాము పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసినప్పటికీ, ఇప్పటివరకు ఒక్కరిని కూడా అరెస్టు చేయకపోవడంపై నిరసనకారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిందితులను రాబోయే మూడు రోజుల్లోగా కఠినంగా శిక్షించకపోతే రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.

ప్రభుత్వం గనుక ఈ విగ్రహ ఏర్పాటును శాశ్వతంగా అడ్డుకోవాలని చూస్తే, తాము బంగ్లాదేశ్‌లోని ప్రతి జిల్లాలోనూ పెద్ద ఎత్తున రాముడి ఆలయాలను నిర్మించి తీరుతామని హిందూ సంఘాల నేతలు స్పష్టం చేశారు. ఈ శాంతియుత నిరసనలను ఢాకాలోని కొన్ని ప్రాంతాల్లో పోలీసులు బలవంతంగా అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో స్వల్ప ఉద్రిక్తత ,గందరగోళం నెలకొంది. బంగ్లాదేశ్‌లో కొత్తగా ఏర్పడిన తారిక్ రెహమాన్ నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో హిందువులు, బౌద్ధులు, క్రైస్తవుల వంటి మైనారిటీలకు రక్షణ కరువైందని, ముస్లిం మెజారిటీ దేశం కావడం వల్లే తమ మత స్వేచ్ఛను కాలరాస్తూ నిరంతరం దాడులు చేస్తున్నారని మైనారిటీ సంఘాలు అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *