జంతర్ మంతర్ వద్ద రెండో సారి కదం తొక్కిన సీజేపీ.. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో పాటు ప్రధాని మోదీ రాజీనామా చేయాలని డిమాండ్..
CJP Protest: ‘Won’t Leave Jantar Mantar Till Dharmendra Pradhan Resigns,’ Says Abhijeet Dipke
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్తో బొద్దింక జనతా పార్టీ (క్రాక్రోచ్ జనతా పార్టీ – సీజేపీ) చేపట్టిన పోరాటం తీవ్రరూపం దాల్చింది. శనివారం (జూన్ 20, 2026) దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ మద్దతుదారులు తమ రెండవ భారీ నిరసన ప్రదర్శన కోసం గుమిగూడారు. గతంలో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) చేసిన కొన్ని వ్యాఖ్యలకు నిరసనగా ఒక వ్యంగ్య సోషల్ మీడియా ప్రచారంగా పుట్టుకొచ్చిన ఈ పార్టీ.. ఢిల్లీలో నిర్వహించిన తొలి ధర్నా ,భారీ ర్యాలీతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
దేశం నలుమూలల నుంచి వేలాది మంది యువత, విద్యార్థులు తరలివచ్చి విద్యావ్యవస్థలో లోపాలు, నీట్ (NEET) పేపర్ లీకేజీలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆ ఉత్సాహంతోనే శనివారం మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభం అయిన ఈ రెండో నిరసన ద్వారా తమ పోరాట పరిధిని మరింత విస్తృతం చేశారు. ఈసారి కేవలం విద్యామంత్రి రాజీనామా మాత్రమే కాకుండా, దేశంలో నానాటికీ పెరిగిపోతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణానికి బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా తన పదవికి రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోదీ వైదొలగాలంటూ నిరుద్యోగం, ద్రవ్యోల్బణం హ్యాష్ ట్యాగ్లతో కూడిన ప్రచారం ఇప్పటికే తీవ్ర దుమారం రేపుతోంది.
సీజేపీ శనివారం నిర్వహిస్తున్న ఈ రెండో నిరసన కోసం ఢిల్లీతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో మద్దతుదారులు తరలివస్తుండటంతో జాతీయ రాజధాని అంతటా భద్రతను అసాధారణ రీతిలో కట్టుదిట్టం చేశారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉండేందుకు ఢిల్లీ పోలీసులు విస్తృత నిఘా ,కఠినమైన జన నియంత్రణ చర్యలను అమలు చేస్తున్నారు. నివారణా చర్యలలో భాగంగా జంతర్ మంతర్ ,దానిని ఆనుకుని ఉన్న ప్రధాన రహదారుల చుట్టూ పలు దఫాలుగా బలమైన బారికేడ్లను ఏర్పాటు చేయడంతో పాటు, నగరంలోని అన్ని కీలక ప్రవేశ, నిష్క్రమణ మార్గాల వద్ద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించడానికి ఉన్నతాధికారులతో కూడిన సీనియర్ ఢిల్లీ పోలీసు అధికారులను ప్రత్యేక విధుల్లో రంగంలోకి దించారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినా తక్షణమే అదుపు చేయడానికి అదనపు రిజర్వ్ బలగాలను కూడా పూర్తి సన్నద్ధతతో ఉంచారు.
ఈ రెండో నిరసన సభలో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మాట్లాడుతూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసేంత వరకు తాము ఈ జంతర్ మంతర్ నిరసన స్థలాన్ని వదిలి వెళ్లే ప్రసక్తే లేదని ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. తాము శాంతియుతంగా పోరాడుతున్నామని, జంతర్ మంతర్ వద్ద తమ నిరసన ప్రదర్శనకు ఉన్న అధికారిక అనుమతి గడువును మరికొంత కాలం పాటు పొడిగించాలని ఆయన ఢిల్లీ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. విద్యామంత్రి రాజీనామా చేయాలనే తమ ప్రధాన షరతుకు గనుక ప్రభుత్వం అంగీకరిస్తే, ఈ సంక్షోభాన్ని ముగించడానికి తాము ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని, అందుకోసం చర్చల మార్గాలను తెరిచి ఉంచాలని కోరారు.
మరోవైపు, ఈ ర్యాలీకి ముందు సీజేపీ మద్దతుదారులకు వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఇచ్చిన పిలుపు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో కోవిడ్-19 మహమ్మారి సమయంలో దేశప్రజలంతా ప్లేట్లు కొట్టాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును వ్యంగ్యంగా పోలుస్తూ.. శనివారం జరిగే ర్యాలీకి వచ్చే వారంతా తమతో పాటు థాలి (పళ్లెం), చమాచ్ (చెంచా) తీసుకురావాలని ఆయన కోరారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల నిరసన గళాన్ని వినూత్న రీతిలో వినిపించేందుకే ఈ ప్లేట్లు, చెంచాల నిరసనను ఎంచుకున్నట్లు సీజేపీ వర్గాలు తెలిపాయి. విద్యావ్యవస్థలోని లోపాల నుంచి మొదలైన ఈ బొద్దింకల పార్టీ నిరసనల పర్వం, ఇప్పుడు నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి దేశవ్యాప్త సమస్యల వైపు మళ్లడం కేంద్ర ప్రభుత్వానికి సరికొత్త సవాలుగా మారింది.