Skip to content
వినోదం వార్తలు

‘పాటకు ప్రాణం’ షూటింగ్‌ షురూ

Prajapaksham 17 Sep 2026 1 నిమిషాల పఠనం వినోదం
‘పాటకు ప్రాణం’ షూటింగ్‌ షురూ

Pataku Pranam

హెచ్‌.టీ సినిమాస్‌ ఎల్‌.ఎల్‌.పి బ్యానర్‌పై హేమల్‌ తుమ్మపూడి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కనున్న తొలి చిత్రం ‘పాటకు ప్రాణం’ హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ఫిల్మ్‌ ల్యాబ్‌లో ఘనంగా ప్రారంభమైంది. హీరో నిఖిల్‌ క్లాప్‌ కొత్తగా , సురేందర్‌ రెడ్డి కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు సురేందర్‌ రెడ్డి, హీరో నిఖిల్‌ ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ మ్యూజికల్‌ ఫిల్మ్‌లో సుదర్శన్‌, సాత్విక జంటగా నటిస్తున్నారు. సీనియర్‌ నటుడు తనికెళ్ల భరణి కీలక పాత్రలో కనిపించనున్నారు. వీరితో పాటు రాజీవ్‌ కనకాల, అనితా చౌదరి, రఘు కారుమంచి, బ్రహ్మాజీ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానుందని దర్శక నిర్మాత హేమల్‌ తుమ్మపూడి తెలిపారు. అనంతరం తనికెళ్ల భరణి మాట్లాడుతూ ఈ సినిమాకు చాలా ఛాలెంజింగ్‌ స్క్రిప్ట్‌. ముఖ్యంగా పాటలకు చాలా ప్రాధాన్యత ఉంది. సాధారణంగా సినిమాలో కథకు తగ్గట్టుగా పాటలు వస్తుంటాయి. కానీ ఈ సినిమాలో మాత్రం కథే పాటల చుట్టూ తిరుగుతుంది. గతంలో ఇలాంటి నేపథ్యంతో వచ్చిన సినిమా ‘శంకరాభరణం’. ‘పాటకు ప్రాణం’ సినిమాను ‘శంకరాభరణం’తో పోల్చడం లేదు. అయితే ఆ సినిమాలో ఉన్న సంగీత స్ఫూర్తి ఈ సినిమాలో కూడా కనిపిస్తుంది. ఈ చిత్రంలో ఒక పాత తరం సంప్రదాయ సంగీత విద్వాంసుడికి, ఈ తరం జెన్‌-జీ సంగీతకారుడికి మధ్య ఉండే ఆసక్తికరమైన కలయికను చూపించబోతున్నారు. ఈ సినిమా దర్శకుడిపై నాకు పూర్తి నమ్మకం ఉంది అని అన్నారు. రాజీవ్‌ కనకాల మాట్లాడుతూ ఈ మ్యూజికల్‌ జర్నీ అందరినీ తప్పకుండా అలరిస్తుందని, స్ఫూర్తినిస్తుందని నమ్ముతున్నాను. ఇక నా పాత్ర విషయానికి వస్తే.. ‘లిటిల్‌ హార్ట్‌ హిట్‌ సినిమా తర్వాత అనితా చౌదరితో మరోసారి కలిసి నటిస్తున్నాను అన్నారు. హీరో సుధర్శన్‌ వంగల మాట్లాడుతూ మా దర్శకుడు హేమల్‌ చాలా చిన్న వయసులోనే ఎంతో ప్యాషన్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇలాంటి మ్యూజికల్‌ సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ప్రేక్షకులు థియేటర్లలో ఒక అద్భుతమైన అనుభూతిని పొందేలా మంచి సినిమాను అందించగలమనే నమ్మకం మాకు ఉంది అని తెలిపారు. హీరోయిన్‌ సాత్విక మాట్లాడుతూ అరుణ్‌ జీవిత ప్రయాణంలో రాధ పాత్ర కూడా ఒక ముఖ్యమైన భాగంగా ఉంటుందని అన్నారు. నిర్మాత శ్రీరామ్‌ తుమ్మపూడి, డిఒపి సంజీత్‌ సింగ్‌ , ఎడిటర్‌ ప్రభాత్‌ రెడ్డి మాట్లాడారు.