Skip to content
బిజినెస్ వార్తలు

Job Change Crisis: భారత్‌లో ఉద్యోగ సంక్షోభం.. ప్రతి ఇద్దరిలో ఒకరు ఉద్యోగం మార్చాలని చూస్తున్నారట..

Prajapaksham 25 Aug 2026 1 నిమిషాల పఠనం బిజినెస్
Job Change Crisis: భారత్‌లో ఉద్యోగ సంక్షోభం.. ప్రతి ఇద్దరిలో ఒకరు ఉద్యోగం మార్చాలని చూస్తున్నారట..

Job Change Crisis

Job Change Crisis: భారత్‌లో ప్రొఫెషనల్ సర్వీసెస్ రంగం వేగంగా మార్పులకు లోనవుతోంది. ఈ మార్పులలో ప్రధానంగా జనరేషన్ జెడ్ (జెన్-జీ) ఉద్యోగుల భాగస్వామ్యం ఊహించని రీతిలో పెరగడం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ‘గ్రేట్ ప్లేస్ టు వర్క్’ ఇటీవల 130కి పైగా సంస్థలు , 1.1 లక్షల మంది ఉద్యోగులపై నిర్వహించిన లోతైన అధ్యయనం ప్రకారం.. ఈ రంగంలో ఉద్యోగుల ధోరణులు, పని సంస్కృతి , యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సవాళ్లకు సంబంధించిన ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి.

గత మూడేళ్ల కాలంలో ప్రొఫెషనల్ సర్వీసెస్ రంగంలో ఉద్యోగుల నిర్మాణంలో స్పష్టమైన మార్పు వచ్చింది. 2023లో మొత్తం ఉద్యోగులలో జెన్-జీ వాటా 17 శాతంగా ఉండగా, నేడు అది ఏకంగా రెండింతలై 34 శాతానికి చేరుకుంది. ఈ నూతన తరం రాకతో సంస్థల పనితీరు , అంచనాలలో కూడా మార్పులు మొదలయ్యాయి. జెన్-జీ ఉద్యోగులు తమ వేతనం, పనికి లభించే గుర్తింపు, , పదోన్నతుల ప్రాతిపదికలపై అత్యంత స్పష్టతను కోరుకుంటున్నారు. విధానాలలో పారదర్శకత లేకపోతే లేదా తమ అంచనాలు నెరవేరకపోతే, వారు వేగంగా ఉద్యోగాలు మారడానికి వెనుకాడటం లేదు.

మరొకవైపు సంస్థలలో ఉద్యోగులను నిలుపుకోవడం యాజమాన్యాలకు ఒక పెద్ద సవాలుగా పరిణమించింది. ప్రస్తుతం ప్రతి ఇద్దరు ఉద్యోగుల్లో ఒకరు (50%) కొత్త అవకాశాల కోసం అన్వేషణలో ఉన్నారు. అలా ఉద్యోగం వీడాలని భావిస్తున్న వారిలో నలుగురిలో ముగ్గురు రాబోయే 12 నెలల వ్యవధిలోనే బయటకు వెళ్లాలని యోచిస్తుండటం తీవ్రమైన విషయంగా మారింది. ఈ ధోరణి కేవలం ప్రాథమిక స్థాయి ఉద్యోగులకే పరిమితం కాకుండా మేనేజ్మెంట్ స్థాయిలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రాజెక్టుల ఒత్తిడి, క్లయింట్ల నిరంతర డిమాండ్లు , బృందాలను నడిపించే బాధ్యతల కారణంగా ఫ్రంట్‌లైన్ మేనేజర్లు, సూపర్‌వైజర్లలో ఏకంగా 86 శాతం మంది కొత్త ఉద్యోగాల వైపు చూస్తున్నారు.

సాంకేతికత పరంగా చూస్తే, దాదాపు 60 శాతం సంస్థలు తమ రోజువారీ కార్యకలాపాల్లో కృత్రిమ మేధను (AI) వినియోగిస్తున్నాయి. అయితే, ఈ సాంకేతిక మార్పుపై ఉద్యోగులకు తగినంత అవగాహన లభించడం లేదు. AI సాధనాల వల్ల కలిగే ప్రయోజనాలు , నష్టాలపై తమకు స్పష్టమైన సమాచారం ఉందనడానికి కేవలం 20 శాతం మంది ఉద్యోగులు మాత్రమే అంగీకరించారు.

సమగ్రంగా పరిశీలిస్తే, సంస్థలలో భౌతిక వసతులు మెరుగుపడుతున్నప్పటికీ, ఉద్యోగులలో బాధ్యతలకు మించి పనిచేయాలనే ఉత్సాహం క్రమంగా తగ్గుతోంది. కాబట్టి, ఉద్యోగులను సుదీర్ఘకాలం సంస్థతో అనుసంధానించాలంటే కేవలం భౌతిక సౌకర్యాలు కల్పించడం సరిపోదని, పారదర్శకమైన పని వాతావరణం, స్పష్టమైన అభివృద్ధి అవకాశాలు , బలమైన సంస్థాగత సాంస్కృతిక మార్పులు అత్యంత అవసరమని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.