Skip to content
తెలంగాణ వార్తలు

Telangana Assembly Session:  బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలకు ఊరట.. రిమాండ్‌ను తిరస్కరించిన నాంపల్లి కోర్టు!

jagan 08 Sep 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Telangana Assembly Session:  బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలకు ఊరట.. రిమాండ్‌ను తిరస్కరించిన నాంపల్లి కోర్టు!

BRS MLCs Tata Madhu, Naveen Reddy

Telangana Assembly Session:  తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలకు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. పోలీసులు దాఖలు చేసిన రిమాండ్ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. ఇద్దరు నేతలకు రూ. 10 వేల సొంత పూచీకత్తుతో పాటు ఇద్దరు వ్యక్తుల షూరిటీలను సమర్పించాలని ఆదేశించింది. పూచీకత్తులు సమర్పించిన అనంతరం వారిని వెంటనే విడుదల చేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.

అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను ఉద్దేశించి తాతా మధు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదుతో పాటు, వారిద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఈ పరిణామాలు సభలోనూ, వెలుపలా తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలకు దారితీశాయి.

మంగళవారం ఉదయం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద BRS ఎమ్మెల్సీల అరెస్ట్ సందర్భంగా తీవ్ర హైడ్రామా చోటుచేసుకుంది. పోలీసులు తాతా మధు నివాసానికి చేరుకుని బయటకు రావాలని కోరగా ఆయన నిరాకరించారు. సమాచారం అందుకున్న బిఆర్ఎస్ శ్రేణులు అక్కడికి భారీగా చేరుకుని అరెస్టును అడ్డుకునేందుకు యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. చివరకు పోలీసులు వారితో మాట్లాడి తాతా మధును, అలాగే బలవంతంగా నవీన్ కుమార్ రెడ్డిని తమ వాహనాల్లో తరలించారు. అయితే తాను స్పీకర్‌ను ఎలాంటి దుర్భాషలాడలేదని, కావాలనే తమపై అక్రమ కేసులు బనాయించారని తాతా మధు ముందే వివరణ ఇచ్చారు. పోలీసుల రిమాండ్ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చడంతో BRS శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.