Skip to content
జాతీయం వార్తలు

దేశం క్షమాపణ కోరుతుంటే, ఆయనే దేశాన్ని క్షమించారట.. ప్రధాని మోదీపై కాంగ్రెస్ సెటైర్లు..

Prajapaksham 01 Aug 2026 1 నిమిషాల పఠనం జాతీయం
దేశం క్షమాపణ కోరుతుంటే, ఆయనే దేశాన్ని క్షమించారట.. ప్రధాని మోదీపై కాంగ్రెస్ సెటైర్లు..

CJP Responds PM Modi Message

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల నిరసన ప్రదర్శన సందర్భంగా తనను, తన దివంగత తల్లిని దూషించిన విద్యార్థులను క్షమించాలనుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వీడియో సందేశంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై దేశం ప్రధానిని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తుంటే.. ఆయన మాత్రం అందుకు భిన్నంగా ఏకంగా దేశాన్నే క్షమించేసినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేసింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో అర్థరాత్రి విడుదల చేసిన వీడియో సందేశంలో ప్రధాని మోదీ.. ఈ నిరసనలపై ఆవేదన వ్యక్తం చేశారు. జంతర్ మంతర్ వద్ద తనపైనే కాకుండా తన దివంగత తల్లిపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని.. అయితే విద్యార్థులను శిక్షించడం లేదా కోర్టులకు లాగడం వల్ల ఎలాంటి సమస్యలు పరిష్కారం కావని ఆయన అభిప్రాయపడ్డారు. నిరసన తెలుపుతున్న వారిని దారితప్పిన పిల్లలుగా అభివర్ణించిన ప్రధాని.. ప్రజలు తప్పులు చేయడం సహజమని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఆడపిల్లలు అలాంటి దూషణపూరిత భాషను ఉపయోగించడం సాంస్కృతికంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని.. ఏదేమైనా వారు మన పిల్లలే కాబట్టి ఆ యువతను క్షమించి వారికి సరైన మార్గం చూపించడమే సమాజంగా మన కర్తవ్యమని మోదీ పేర్కొన్నారు.

ప్రధాని విడుదల చేసిన వీడియో, పోస్ట్‌ను ట్యాగ్ చేస్తూ కాంగ్రెస్ మీడియా, ప్రచార విభాగం అధిపతి పవన్ ఖేరా సామాజిక మాధ్యమం ‘X’ వేదికగా స్పందించారు. విద్యార్థుల భవిష్యత్తు, నీట్ లోపాలపై దేశమంతా ప్రధాని నుంచి క్షమాపణ కోరుతుంటే.. ఆయన మాత్రం రివర్స్‌లో దేశాన్ని క్షమించేశానని చెబుతున్నారంటూ హిందీలో పోస్ట్ చేస్తూ మోదీ తీరును తప్పుబట్టారు. విద్యార్థుల సమంజసమైన డిమాండ్లను పరిష్కరించకుండా.. వారిని దారితప్పిన పిల్లలుగా చిత్రీకరిస్తూ ప్రధాని అసలు సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.

ట్యాగ్‌లు: BJP CJP protest Congress PM Modi