Skip to content
జాతీయం వార్తలు

SC on Air Force Resignations: ఇష్టానుసారం ఉద్యోగం వదిలి వెళ్లే హక్కు లేదు.. ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగుల అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..

Prajapaksham 30 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
SC on Air Force Resignations: ఇష్టానుసారం ఉద్యోగం వదిలి వెళ్లే హక్కు లేదు.. ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగుల అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..

Supreme Court

దేశ రక్షణ బాధ్యతలు నిర్వర్తించే సైనిక దళాల్లో పనిచేసే సిబ్బంది తమ వ్యక్తిగత నిర్ణయాల ఆధారంగా ఎప్పుడైనా ఉద్యోగం వదిలి వెళ్లడం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముందస్తు అనుమతి, ఎన్‌ఓసీ వంటి నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొంటూ నఖత్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.

SC on Air Force Resignations: భారత వాయుసేన (IAF)లో పనిచేస్తున్న సిబ్బంది ముందస్తు అనుమతి లేకుండా ఉద్యోగాన్ని వీడి ఇతర ప్రభుత్వ లేదా సివిల్ ఉద్యోగాల్లో చేరలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశ భద్రత, సైనిక క్రమశిక్షణ దృష్ట్యా.. వాయుసేన సిబ్బందికి సేవ నుంచి ఇష్టానుసారంగా వైదొలిగే నిరపేక్ష హక్కు (Absolute Right) లేదని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది.

జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ అతుల్ ఎస్. చందుర్కర్లతో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పు వెలువరించింది. సివిల్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే ముందు సంబంధిత ఉన్నతాధికారుల నుంచి తప్పనిసరిగా ముందస్తు అనుమతి పొందాలని.. ఆ నిబంధనను విస్మరించడం కుదరదని కోర్టు స్పష్టం చేసింది.

రాజస్థాన్‌కు చెందిన నఖత్ సింగ్ అనే వ్యక్తి భారత వాయుసేనలో కార్పోరల్‌గా ఏడేళ్ల పాటు సేవలందించారు. 2020లో రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (RPSC) విడుదల చేసిన హిందీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు దరఖాస్తు చేసి పరీక్షలు, ఇంటర్వ్యూలో విజయం సాధించారు.

అయితే సివిల్ పోస్టుకు దరఖాస్తు చేసే ముందు వాయుసేన నుంచి అనుమతి తీసుకోకుండా.. ఎంపికైన తర్వాత 2022 అక్టోబర్‌లో మాత్రమే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC), డిశ్చార్జ్ ఆర్డర్ కోసం దరఖాస్తు చేశారు. దీంతో 2017 ఎయిర్ ఫోర్స్ ఆర్డర్ ప్రకారం ముందస్తు అనుమతి తీసుకోలేదనే కారణంతో వాయుసేన అధికారులు ఆయన అభ్యర్థనను తిరస్కరించారు.

నఖత్ సింగ్ మొదట సాయుధ దళాల ట్రిబ్యునల్ (AFT)ను ఆశ్రయించగా అక్కడ కూడా నిరాశే ఎదురైంది. అనంతరం ఢిల్లీ హైకోర్టు కూడా వాయుసేన నిర్ణయాన్ని సమర్థించింది. చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ అక్కడ కూడా ఆయనకు అనుకూల తీర్పు రాలేదు.

దేశ రక్షణ బాధ్యతలు నిర్వర్తించే సైనిక దళాల్లో పనిచేసే సిబ్బంది తమ వ్యక్తిగత నిర్ణయాల ఆధారంగా ఎప్పుడైనా ఉద్యోగం వదిలి వెళ్లడం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముందస్తు అనుమతి, ఎన్‌ఓసీ వంటి నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొంటూ నఖత్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.

ఈ తీర్పుతో భారత వాయుసేనతో పాటు ఇతర సాయుధ దళాల్లో పనిచేస్తున్న సిబ్బంది సివిల్ ఉద్యోగాలకు మారే విషయంలో అమల్లో ఉన్న నిబంధనలకు సుప్రీంకోర్టు మరింత బలం చేకూర్చినట్లైంది.