Rahul Gandhi Protest: రాహుల్ గాంధీ ధర్నాతో వేడెక్కిన ఢిల్లీ.. ప్రధాని మోదీ నివాసం ఎదుట బైఠాయించిన ప్రతిపక్ష నేత.. రాజీనామా చేయాలని డిమాండ్..
Rahul Gandhi Protest: రాహుల్ గాంధీ ధర్నాతో వేడెక్కిన ఢిల్లీ.. ప్రధాని మోదీ నివాసం ఎదుట బైఠాయించిన ప్రతిపక్ష నేత.. ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్..
Rahul Gandhi Protest: దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. బొద్దింక జనతా పార్టీ- సీజేపీ నేతృత్వంలో పార్లమెంటు వైపు సాగిన మార్చ్పై పోలీసులు తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సంగతి విదితమే. లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించిన మరుసటి రోజే దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ సమీకరణాలు అత్యంత వేగంగా మారిపోయాయి. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడిని పెంచేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది.
ఇందులో భాగంగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మంగళవారం మధ్యాహ్నం న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసం వైపు భారీ ప్రదర్శనగా వెళ్లి నిరసనను వ్యక్తం చేశారు. ఖర్గే నివాసమైన 10, రాజాజీ మార్గ్ నుండి ప్రారంభమైన ఈ ప్రదర్శన.. సుమారు ఒక కిలోమీటరు దూరంలో ఉన్న ప్రధాని అధికారిక నివాసం 7, లోక్ కళ్యాణ్ మార్గ్ దిశగా సాగింది.
ఈ నిరసన వెనుక ఉన్న ప్రధాన కారణాలను పరిశీలిస్తే.. సోమవారం నాడు నీట్ (NEET), ఇతర పోటీ పరీక్షల పేపర్ లీకేజీల ఉదంతంపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ సన్సద్ చలో కవాతును చేపట్టింది. ఈ క్రమంలో నిరసన తెలుపుతున్న యువత, విద్యార్థులపై పోలీసులు మరియు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు విచక్షణారహితంగా దాడి చేశాయని నిరసనకారులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రక్షణ దళాలు ప్రయోగించిన లాఠీచార్జ్, టియర్ గ్యాస్ బాంబింగ్ కారణంగా అనేక మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడి రక్తం చిందించారని సీజేపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే, ఈ ఆరోపణలను ఢిల్లీ పోలీసులు ఖండించారు. నిరసనకారులు తీవ్రంగా, దురుసుగా ప్రవర్తిస్తూ హింసకు పాల్పడ్డారని, విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై రాళ్లతో దాడి చేసి పోలీసు వాహనాలను ధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ ఘర్షణల్లో సీనియర్ అధికారులతో సహా మొత్తం 118 మంది పోలీసు సిబ్బంది గాయపడినట్లు పోలీసు దళం నివేదించింది.
సోమవారం నాటి ఘటనలో గాయపడిన విద్యార్థుల పట్ల సంఘీభావం తెలుపుతూ.. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సామాజిక మాధ్యమం ‘X’ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సీజేపీ లేవనెత్తిన విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్ను దాటి.. ఆయన నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశ భవిష్యత్తు అయిన యువత పట్ల ప్రభుత్వం అవలంబించిన క్రూరత్వానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రధానిపై ఉందన్నారు. భారతీయ యువత భవిష్యత్తును నాశనం చేసినందుకు ఈ ఇద్దరు అగ్రనేతలు తమ పదవుల నుండి తప్పుకోవాలని.. ఈ విషయాన్ని పార్లమెంటులో చర్చించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ అనుహ్యంగా చేపట్టిన ఈ నిరసన ప్రదర్శనతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైన ఢిల్లీ పోలీసులు, ప్రధాని నివాసం వద్ద భద్రతను పటిష్టం చేస్తూ అదనపు బలగాలను రంగంలోకి దించారు. నిరసనకారులను అడ్డుకుని, అదుపులోకి తీసుకోవడం ప్రారంభించారు. ఈ క్రమంలో అధికార బీజేపీ మరియు కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి భద్రతను ప్రమాదంలోకి నెట్టేలా కాంగ్రెస్ నాయకులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు.
ఈ ఆరోపణలను కాంగ్రెస్ నేతలు గట్టిగా తిప్పికొట్టారు. ప్రధానమంత్రి పార్లమెంటు సమావేశాలకు సరిగా హాజరు కావడం లేదని, కొద్దిసేపట్లోనే సభను వదిలి వెళ్తున్నారని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ విమర్శించారు. ప్రజా సమస్యలను, యువత ఆక్రందనలను వినిపించడానికి ప్రధాని నివాసానికి రావడం తప్ప తమకు వేరే మార్గం లేదని, తమ నిరసన పూర్తిగా శాంతియుత మార్గంలోనే సాగుతోందని ఆయన స్పష్టం చేశారు.