Skip to content
బిజినెస్ వార్తలు

ఈవీ ఛార్జింగ్‌కు భారత ఇళ్లు సిద్ధంగా లేవా.. తాజా నివేదికలో ఆసక్తికర అంశాలు

Prajapaksham 01 Jul 2026 0 నిమిషాల పఠనం బిజినెస్
ఈవీ ఛార్జింగ్‌కు భారత ఇళ్లు సిద్ధంగా లేవా.. తాజా నివేదికలో ఆసక్తికర అంశాలు

EV charging India

భారతదేశంలో విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ) విప్లవం వేగంగా విస్తరిస్తున్న తరుణంలో, మౌలిక వసతుల లోపాలను ఎత్తిచూపుతూ వచ్చిన ఈ నివేదిక అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. కజమ్‌, ఏఈఈఈ సంయుక్తంగా విడుదల చేసిన ఈ నివేదిక కేవలం ఒక గణాంకం మాత్రమే కాకువడా.. భవిష్యత్తులో దేశంలో ఈవీల భద్రతకు సంబంధించి ఇండస్ట్రీకి ,వినియోగదారులకు ఒక హెచ్చరిక లాంటిది.

దేశంలో గడిచిన పదేళ్లుగా ద్విచక్ర వాహనాలు, కార్లు, వాణిజ్య వాహనాల రూపంలో ఈవీల వాడకం విపరీతంగా పెరుగుతోంది. ఇంధన ధరల భారం తగ్గించుకోవడానికి, పర్యావరణ హితం కోసం ప్రజలు ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, వాహనాల అమ్మకాలు పెరుగుతున్న వేగంతో పోలిస్తే, వాటిని సురక్షితంగా చార్జ్ చేసుకోగల గృహ విద్యుత్ వసతులు దేశంలో సమాంతరంగా అభివృద్ధి చెందడం లేదనే నిజాన్ని ఈ నివేదిక బయటపెట్టింది.

దేశవ్యాప్తంగా వివిధ శ్రేణుల నగరాల్లోని సుమారు ఎనభై వేల నివాసాలను పరిశీలించినప్పుడు, కేవలం యాభై ఐదు శాతం ఇళ్లలోనే ఈవీ చార్జింగ్‌కు సరిపడా ఆధునిక విద్యుత్ సదుపాయాలు ఉన్నాయని తేలింది. మిగిలిన నలభై ఐదు శాతం ఇళ్లలో పాతబడిన లేదా అరకొర విద్యుత్ వ్యవస్థలు ఉండటం వల్ల, అక్కడ ఈవీలను చార్జ్ చేయడం తీవ్ర ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది.

ఈ ప్రమాద తీవ్రతను మనం ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో జరిగిన అగ్ని ప్రమాదాల రూపంలో చూశాం. తక్కువ సామర్థ్యం ఉన్న వైరింగ్, సరైన ఎర్తింగ్ లేకపోవడం, హెచ్చుతగ్గులకు లోనయ్యే వోల్టేజ్ వంటి కారణాల వల్ల చార్జింగ్ పెట్టే సమయంలో బ్యాటరీలు వేడెక్కి పేలిపోతున్నాయి. కేవలం వాహనం కొనుగోలు చేయడమే కాకుండా, దానికి తగినట్లుగా ఇళ్లలోని ఎలక్ట్రికల్ కనెక్షన్లను అప్‌గ్రేడ్ చేసుకోవడం ఎంత ముఖ్యమో ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా అపార్ట్‌మెంట్లు, ఇండిపెండెంట్ ఇళ్లలో చార్జింగ్ పాయింట్ల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.

భవిష్యత్తును పరిశీలిస్తే, విద్యుత్ వినియోగంపై ఈవీల ప్రభావం చాలా భారీగా ఉండబోతోంది. జాతీయ స్థాయిలో ఈవీ చార్జింగ్ కోసం వాడే విద్యుత్ వాటా రాబోయే పదేళ్లలో సున్నా పాయింట్ రెండు శాతం నుండి ఏకంగా ఆరు శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అంటే పవర్ గ్రిడ్‌లపై, గృహ విద్యుత్ లైన్లపై ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వాలు ,విద్యుత్ సరఫరా సంస్థలు కేవలం పబ్లిక్ చార్జింగ్ స్టేషన్ల గురించే కాకుండా, ఇళ్లలో సురక్షిత చార్జింగ్ మౌలిక వసతుల కల్పనపై, నిబంధనలపై స్పష్టమైన పద్ధతులను తీసుకురావాలి. పెరిగే డిమాండ్‌కు తగ్గట్టుగా ఇళ్లలోని విద్యుత్ వ్యవస్థలను ఆధునీకరించుకోకపోతే, పర్యావరణ హితం కోసం తెచ్చుకున్న ఈవీలు నివాస ప్రాంతాల్లో పెద్ద భద్రతా సవాలుగా మారే ప్రమాదం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *