Skip to content
జాతీయం వార్తలు

రాజస్థాన్ దౌసాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది అగ్నికి ఆహుతి..

Prajapaksham 01 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
రాజస్థాన్ దౌసాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది అగ్నికి ఆహుతి..

Fire

రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దిల్లీ – ముంబయి ఎక్స్‌ప్రెస్‌వేపై ధనవాడ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఒక లగ్జరీ స్లీపర్‌ బస్సు, ముందు వెళ్తున్న ట్రక్కును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన వెంటనే ప్రమాద తీవ్రతకు బస్సులో భారీగా మంటలు చెలరేగి క్షణాల వ్యవధిలోనే బస్సంతా వ్యాపించాయి. ఈ దురదృష్టకర ఘటనలో ఎనిమిది మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, మరో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. బాధితుల పరిస్థితిని బట్టి మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

పోలీసులు మరియు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. బుధవారం తెల్లవారుజామున సుమారు 2.30 గంటల సమయంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్న వేళ ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ బస్సు ఉత్తరాఖండ్‌లోని రిషికేష్‌ నుంచి మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌కు వెళ్తుండగా దౌసా జిల్లా పరిధిలోకి రాగానే ప్రమాదానికి గురైంది. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు రంగంలోకి దిగి మంటలను అదుపు చేసి బాధితులను ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదంపై పోలీసులు ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాద సమయంలో బస్సు డ్రైవర్‌ నిద్రమత్తులో ఉన్నాడా.. లేక అతివేగం, సాంకేతిక లోపం వంటి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు వేగంగా వ్యాపించడంతో ఐదుగురు ప్రయాణికులు బస్సు లోపల నుంచే బయటకు రాలేక మంటల్లోనే సజీవ దహనమయ్యారని పోలీసులు విచారకరమైన నిజాలను వెల్లడించారు. అలాగే తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *